జిల్లా కాంగ్రెస్ లో మరోసారి బయటపడ్డ విభేదాలు..

జిల్లా కాంగ్రెస్ లో మరోసారి బయటపడ్డ విభేదాలు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 20:

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మదన్ మోహన్ రావు, తోట లక్ష్మీ కాంతారావు తో పాటు మూడు నియోజకవర్గాల ముఖ్య నాయకులు కార్యక్రమానికి హాజరు కాలేదు. కేవలం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సుభాష్ రెడ్డి మరియు ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే కార్యక్రమానికి హాజరయ్యారు. గత కొంతకాలంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, తోట లక్ష్యి కాంతారావు లకు సఖ్యత లేకపోవడంతో పాటు ఎమ్మెల్యే, పార్లమెంట్ ఎన్నికలలో కామారెడ్డి నియోజకవర్గంలో బిజెపికి మెజార్టీ వచ్చిన షబ్బీర్ అలీ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇవ్వడంతో ఎమ్మెల్యేలు కినుక వాయించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన మద్ది చంద్రకాంత్ రెడ్డి మొదటగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఆశించడంతో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో చివరికి ఎంపీ సురేష్ షెట్కార్, షబ్బీర్ అలీలు ముఖ్యమంత్రి వద్ద పట్టుబట్టి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని లాక్కోవడంతో ముగ్గురు ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. జిల్లాకు సంబంధించిన కార్యక్రమం అయినా తమ అనుచరులకు అవకాశం కల్పించకపోవడంతో షబ్బీర్ అలీపై జిల్లా ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. ఇకపై రాష్ట్రస్థాయిలో ఉన్న కార్పొరేషన్ పదవులతోపాటు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి మూడు నియోజకవర్గాలకు కేటాయించాలని ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా జిల్లా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జోక్యం చేసుకొని అందరికీ సమాన అవకాశాలు కల్పించకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం తప్పదని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం కామారెడ్డి నియోజకవర్గానికి మాత్రమే పదవులు కేటాయిస్తే చూస్తూ ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేల అనుచరులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now