*జవహర్నగర్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ*
*మేడ్చల్ నియోజకవర్గంలో 3500 ఇళ్లకు మంజూరు: తోటకూర వజ్రెష్ యాదవ్*
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ ప్రశ్న ఆయుధం జూన్ 25
మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు ప్రతాలను పంపిణీ చేసే కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వసంత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యులు భీమిడి జైపాల్ రెడ్డి, జవహర్నగర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, మాజీ మేయర్ శాంతి కోటేశ్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇంటి నిర్మాణ పనుల్లో ఆలస్యం లేకుండా లబ్ధిదారులకు ప్రతి సోమవారం చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నాలుగు విడతల్లో నిధులు జమ అవుతాయని పేర్కొన్నారు. నిధుల పంపిణీ వివరాలను ఆయన వెల్లడించారు:
* బేస్మెంట్ పూర్తయిన వెంటనే రూ. 1,00,000
* గోడలు పూర్తయ్యాక రూ. 1,25,000
* స్లాబ్ తరువాత రూ. 1,75,000
* తుదిపనులు తరువాత మరో రూ. 1,00,000
ఈ విధంగా మొత్తం రూ. 5,00,000 వరకు మంజూరు చేస్తున్నట్టు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు మొదటి విడతలో మేడ్చల్ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు. పలు ఇండ్ల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మిగతా ఇండ్లను త్వరలో ప్రారంభించి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సాంకేతిక కారణాలతో కొందరికి ఇప్పుడే ఇండ్లు రాకపోయినా, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు కేటాయించేలా ప్రయత్నం కొనసాగుతుందని స్పష్టం చేశారు.