ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 21
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో భూగర్భ జలాల పరిరక్షణ పై భూగర్భ జలాల పరిరక్షణ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గృహాలు, పరిశ్రమలు మరియు వ్యవసాయ క్షేత్రాల్లో ఇంకుడు గుంతలు మరియు ఫామ్ పౌండ్ లు విస్తృతంగా నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 50 శాతం సబ్సిడీ వస్తుందని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో మరియు పట్టణాలలో నీరు ఎక్కడ నిలబడుతుందో, ఇంకుడు గుంతలు ఎక్కడ నిర్మించాలి అనేది గుర్తించి నిర్మాణాలు చేపట్టాలని ఇంకుడు గుంతల నిర్మాణాల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో లోని ప్రతి గృహంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయు విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో ఇంకుడు గుంతలు ఉచితంగా ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మిస్తామని కలెక్టర్ తెలిపారు. మున్సిపాలిటీలు పరిధిలో ఇంకుడు గుంతలు త్రవ్వినవారికి ఉచితంగా సిమెంట్ రింగ్ లు మరియు కవర్ షీట్ ను అందిస్తామని ఆయన తెలిపారు. ఇంకుడు గుంతల నిర్మాణంలో చేపట్టిన వారికి అధికారులు సన్మానం చేయాలని సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణం సరైన రీతిలో చేపట్టాలని నీరు ఇంకుడు గుంతలోకి వెళ్ళు విధంగా నిర్మాణాలు ఉండాలని ఆయన అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు వసతి గృహాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు ఈ వేసవిలో చెరువుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉంటాయని వాటిలో పూడిక తీయు విధంగా చర్యలు చేపట్టాలన్నారు. చెరువుల్లోని పూడిక తీసిన మట్టిని రైతుల వ్యవసాయ పొలం కి ఉపయోగపడు చర్యలు చేపట్టాలని, ఆ వివరాలను రిజిస్టర్లు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని దమ్మపేట, జూలూరుపాడు, చంద్రుగొండ, సుజాతనగర్, చుంచుపల్లి మండలాల్లో 16 గ్రామాలలో భూగర్భ జలాలు తక్కువగా ఉన్నాయని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు ఫామ్ పాండ్ నిర్మాణాలు చేపట్టే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వారంలో ఒకరోజు ఇంకుడు గుంతల తవ్వకానికి కేటాయించాలని అధికారులను ఆదేశించారు.పరిశ్రమల నుండి వచ్చే వ్యర్ధాలు ద్వారా నీరు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో కమర్షియల్ ప్రదేశాలలో ఇంకుడు గుంతల నిర్మాణానికి తగిన ప్రదేశాలు గుర్తించాలన్నారు. నీటి వృధా పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఒకటే మార్గమని ఇంకుడు గుంతలు త్రవ్వటం విస్తృతంగా చెట్లు నాటడం ద్వారానే భూగర్భ జలాలను పెంపొందించవచ్చును కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు మరియు ప్రజలు అందరూ భూగర్భ జలాలను పెంపొందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణాలను జల్ సంచెయ్ జన్ భాగి దారి లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో భూగర్భ జల శాఖ ఏడి రమేష్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, పబ్లిక్ హెల్త్ శాఖ ఈఈ రంజిత్, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత, అడిషనల్ డిఆర్డిఏ రవి మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.