ప్రశ్న ఆయుధం న్యూస్ మే 2 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
2025-26 వన మహోత్సవంలో భాగంగా 70 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. శుక్రవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశం మందిరంలో అన్ని శాఖల అధికారులతో వనమహోత్సవం పై ఐటీడీఏ పీవో రాహుల్ మరియు అటవీశాఖాధికారి కృష్ణ గౌడ్ తో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని లక్ష్యంతో ప్రభుత్వం ఏటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతుందని, దీనిలో భాగంగా అన్ని శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు. ఈ ఏడాది వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా రైతులకు, ఇంటి ఆవరణ, రహదారుల వెంట, కెనాల్ బండ్ ప్లాంటేషన్ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అత్యధికంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖకు 30 లక్షల మొక్కలు, టీ జి ఎఫ్ డి సి శాఖకు 12 లక్షల మొక్కలు, అటవీశాఖ 10 లక్షలు, సింగరేణి 10 లక్షలు, ఉద్యానవన శాఖ 5.7 లక్షలు, వ్యవసాయ శాఖ 5 లక్షలు, ఇరిగేషన్ 2 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాలను నిర్దేశించారు. వన మహోత్సవంలో భాగంగా నాటే మొక్కలు ఎక్సైజ్ శాఖ అధికారులు తాటి మరియు ఈత చెట్లను నాటాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మునగ మొక్కలు, అటవీశాఖ వెదురు మొక్కలు, విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలల్లో ఔషధ మొక్కలు అయినటువంటి తులసి, కరివేపాకు, ఉసిరి, మునగ మరియు వెలగ మొక్కలను నాటాలన్నారు. ఇరిగేషన్ అధికారులు జిల్లావ్యాప్తంగా ఉన్న కెనాల్ బండ్ ప్లాంటేషన్ లో సుబాబులు మరియు వట్టివేర్లు మొక్కలు నాటాలన్నారు. ఆసక్తి గల రైతులకు అటవీ శాఖ నర్సరీలలో టేకు, ఎర్రచందనం మరియు వెదురు మొక్కలు అందుబాటులో ఉన్నాయని అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు వారికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించటానికి ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించుకోవాలని, వారికి కావలసిన మొక్కలను గ్రామీణ అభివృద్ధి సంస్థ నర్సరీ నుండి తీసుకోవాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తింపు, గుంతల త్రవ్వకం చేపట్టాలన్నారు. మొక్కలు నాటడం తో పాటు మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కిషోర్, ఇరిగేషన్ ఈ ఈ అర్జునరావు, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి తిరుపతయ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
70 లక్షల మొక్కలు నాటడమే వన మహోత్సవ లక్ష్యం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
by Naddi Sai
Published On: May 2, 2025 8:07 pm
