Site icon PRASHNA AYUDHAM

పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

IMG 20241114 WA0217

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయాలని జిల్లా కలెక్టర్ వి.పాటిల్ అన్నారు. గురువారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకం, బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలం చేసి, జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ ఈ బాలల దినోత్సవం పిల్లలను ఉత్సాహపరచడానికి, వారిని గౌరవించటానికి అంకితం చేసిన రోజు. పిల్లలను ఎంతో ప్రేమించే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జ్ఞాపకార్థం ఈ బాలల దినోత్సవం మనమందరం వైభవంగా నిర్వహించుకుంటున్నాం అన్నారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రతి పిల్లలకు ప్రేమ, గౌరవం, వారు భవిష్యత్తులో ఎదగడానికి అవకాశాలు ఇవ్వాలని,వారి కలలను నిజం చేసేందుకు పెద్దలుగా మన వంతు సాయాన్ని చేయాలని,బాలల దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని,సమాజంలో పిల్లల ప్రాముఖ్యతను చెప్పే సందర్భమని,ఈ దేశ భవిష్యత్తు పిల్లలు మీదే ఆధారపడివుందని ఆయన అన్నారు.పిల్లలు వేరే వారితో పోల్చుకోకూడదని, ప్రతి పిల్లల్లో ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని, వాటిని గుర్తించి ఆయా రంగాలలో అభివృద్ధి చెందటానికి తగిన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. పిల్లల్లో సృజనాత్మకతను తల్లిదండ్రులు వెలికి తీయాలని అన్నారు. మన జిల్లాలో ఎంతో నైపుణ్యం కలిగిన పిల్లలు ఉన్నారని, ఈమధ్య ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిర్వహించిన ఆటల పోటీల్లో ఐటీడీఏ వారు ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకున్నారని, వారిని చూసినప్పుడు నాలో ఎంతో ప్రోత్సాహం కలుగుతుందని కలెక్టర్ అన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ తన బాల్యంలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల గురించిన అనుభవాలు విద్యార్థులతో పంచుకున్నారు.పిల్లలు స్వతంత్రంగా జీవించే విధంగా మనం అందరం చర్యలు చేపట్టాలని తెలిపారు. పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో చదివితేనే విజయం సాధిస్తాం అనేది అపోహ మాత్రమే అని దానికి ఉదాహరణ నేను అని కలెక్టర్ తెలిపారు. మనకు వున్నా సౌకర్యారాలను అందిపుచ్చుకొని విజయాలను సాధించాలన్నారు.ప్రస్తుతం గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయని, నెహ్రూ తన కూతురికి రాసిన లేఖలను చదవడం ద్వారా వారికి దేశం మీద ఉన్నటువంటి అభిమానం మరియు తనకున్న దేశభక్తి మనకు తెలుస్తుంది అన్నారు. అదేవిధంగా ఒకప్పుడు వచ్చినటువంటి చందమామ కథలు, చంపక్ కథలు వంటి పుస్తకాలు ఇప్పుడు మనకు ఎక్కడ దొరకటం లేదని, కాబట్టి విద్యార్థినీ,విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లి మంచి పుస్తకాలను చదవటం ద్వారా మంచి జ్ఞానాన్ని పొందవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఐటీడీఏ మనోవికాస్ పాఠశాల అంగవైకల్యం కలిగిన విద్యార్థినిలు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం జిల్లాలో వివిధ రంగాలలో ప్రావీణ్యం సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు కలెక్టర్ ప్రశంస పత్రాలు, పుస్తకాలు మరియు బహుమతులు అందించారు.బీఎస్సీ నర్సింగ్ చేయడానికి గాను తోటకూర రమేష్ (ఎన్నారై ) రూ,,1,00,000 చేసిన ఆర్థిక సహాయం చెక్కును కలెక్టర్ ద్వారా కుసుమ కుమారి విద్యార్థినికి అందించారు. అనంతరం ది ఇన్నర్ వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి లెనినా, సి డబ్ల్యూ సి చైర్మన్ భారత రాణి, సి డబ్ల్యూ సి సభ్యులు సుమిత్రాదేవి, షాదిక్ పాషా, అంబేద్కర్, వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పిల్లలుమరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version