సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ముఖ్య అతిథిగా హాజరై, కౌన్సిలింగ్ ప్రక్రియను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కౌన్సిలింగ్ కార్యక్రమం ద్వారా 2024 డీఎస్సీ (DSC) ఎంపికలో 1:1 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులకు వివిధ పాఠశాలల్లో ఉద్యోగాలు కేటాయించడం జరిగింది. ఈ నియామకంలో ప్రత్యేకంగా SA (School Assistants) అన్ని కేటగిరీలు, LPs (Language Pandits), SGT (Secondary Grade Teachers), మరియు PET (Physical Education Teachers) అభ్యర్థులు పాల్గొన్నారు. విద్యాశాఖ అధికారులు కౌన్సిలింగ్ సమయంలో అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ, నియామక ప్రక్రియ పూర్తి స్థాయిలో పారదర్శకతతో, నిబంధనల ప్రకారం జరుగుతుందని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నియామకాలు జరిగేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వం విద్యా రంగం పురోభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ నాణ్యమైన ఉపాధ్యాయ నియామకాలను చేపడుతోందని, నియామకాలు పూర్తిగా కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో పాఠశాలలకు కేటాయింపు కొలువులు పూర్తిగా మెరిట్ ఆధారంగా, ఎంపిక విధానం ప్రకారం జరగనున్నట్లు తెలిపారు. కౌన్సిలింగ్ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులు ముందుగా తమ అసలైన విద్యార్హత పత్రాలను సమర్పించి ధృవీకరణకు హాజరయ్యారు. వారి సర్టిఫికెట్లు, కేటగిరీలు, విభాగాల వారీగా కేటాయింపు చేయడం జరిగింది. కౌన్సిలింగ్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, అభ్యర్థులు ఎటువంటి సందేహాలు లేకుండా కౌన్సిలింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నియామకాలు పూర్తిగా ప్రభుత్వ నియామక నిబంధనల ప్రకారం నిర్వహించబడతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ఎంపికైన ఉపాధ్యాయులు, విద్యార్థులకు అత్యుత్తమమైన విద్య అందించేందుకు కృషి చేయాలని, పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కౌన్సిలింగ్ సమయంలో అభ్యర్థులు పాఠశాలల కేటాయింపుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉత్తమ ఉపాధ్యాయ సేవలు అందించేందుకు కృషి చేస్తామని కొందరు అభ్యర్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, నియామక ప్రక్రియలో ఎటువంటి వివాదాలు లేకుండా నియామకాలు జరిగినందుకు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి ఈ నియామకాలు కీలకమని, విద్యార్థులకు మంచి ఉపాధ్యాయులు దొరకడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నియామక పత్రాలను అందుకున్న ఉపాధ్యాయులు తక్షణమే తమ బాధ్యతలను నిర్వర్తించాలని, విద్యార్థులకు ఉన్నత ప్రమాణాల విద్య అందించేందుకు తగిన విధంగా శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీఈఓ వేంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు హాజరయ్యారు.
డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్ క్రాంతి
Published On: October 15, 2024 8:00 pm
