పుస్తకాల పఠనాన్ని అలవాటు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య సారథ్యంలో సోమవారం క్విజ్, వ్యాస రచన పోటీలను నిర్వహించారు. గ్రంథాలయ శాస్త్రం, పుస్తక పఠన ప్రాధాన్యం, చదివే అలవాటు పెంపు, ఉత్తమ చదువరి ప్రోత్సాహకం వంటి విషయాలపై విద్యార్థులను ప్రోత్సహిస్తూ పోటీలు నిర్వహించడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, సరస్వతి దేవి, జవహర్‌లాల్ నెహ్రూ, డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ చిత్ర పటాలకు పుష్పమాలలు అర్పించి, అనంతరం గ్రంథాలయ ప్రతిజ్ఞతో వారోత్సవాల ప్రారంభోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… గ్రంథాలయంలో లభించే అన్ని రకాల పుస్తకాలను చిన్నారుల నుండి సీనియర్ సిటిజెన్స్ వరకు అందరూ చక్కగా వినియోగించుకోవాలని తెలిపారు. ముద్రిత గ్రంథాలయాలతో పాటు డిజిటల్ గ్రంథాలయాలు ఆధునిక కాలంలో అత్యంత ప్రాముఖ్యమని, వాటిని అభివృద్ధి చేయడానికి సి.యస్.ఆర్ నిధుల సహకారం అందించే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. గ్రంథాలయం అందిస్తున్న సేవలు, పాఠకుల అవసరాలు, అభివృద్ధి చేయవలసిన అంశాలపై వివరణాత్మకంగా గ్రంథాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోటీల్లో పాల్గొన్న వివిధ విద్యా సంస్థల విద్యార్థులను అభినందించిన కలెక్టర్, పోటీ పరీక్షల పుస్తకాలు మాత్రమే కాకుండా నవలలు, సాంస్కృతిక గ్రంథాలు, అకాడమీ పబ్లికేషన్లు, పత్రికలు తదితరాలను చదివే మంచి అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది శ్రీనివాస్, ప్రశాంత్, శోభారాణి, వరలక్ష్మీ, సావిత్రి, కృష్ణమూర్తి, నాగరాజు తదితరులతో పాటు అనేక మంది పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now