సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం పరిశీలించారు. గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో సర్వే బృందం క్షేత్ర స్థాయి పరిశీలన జరుపుతున్న తీరును తనిఖీ చేశారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అర్హులను గుర్తించేందుకు అవలంభిస్తున్న విధానాలను, సర్వే బృందాలు ఇంటింటికి తిరుగుతూ సేకరిస్తున్న వివరాలను కలెక్టర్ పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సేకరించిన వివరాలను రిజిస్టర్లలో స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్ సర్వే సిబ్బందిని ఆదేశించారు. త్వరితగతిన ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, తప్పిదాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఫీల్డ్ వెరిఫికేషన్ కొనసాగుతోందని తెలిపారు. ముఖ్యంగా రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు లబ్ది చేకూర్చేందుకు వీలుగా సాగుకు యోగ్యమైన భూములను సర్వే నెంబర్ల వారీగా క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా నిర్ధారించడం జరుగుతోందన్నారు. అదే విధంగా ఆహార భద్రతా కార్డులను అర్హత కలిగిన కుటుంబాలకు అందించేందుకు వీలుగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికార బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నాయని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నాటికి ఆయా పథకాల కింద అర్హులైన వారి జాబితాలను రూపొందించి, 21 నుండి 24వ తేదీ వరకు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో నిర్వహించనున్న గ్రామ సభలలో వాటిని ప్రవేశపెట్టి చదివి వినిపించడం జరుగుతుందన్నారు. గ్రామ సభ ఆమోదం మేరకు లబ్ధిదారుల వివరాలను సంబంధిత పోర్టల్ లో నమోదు చేస్తామన్నారు. ఈ నెల 26 వ తేదీన ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు శ్రీకారం చుట్టి లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చనుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారి. రవీందర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి అఖిలేష్ రెడ్డి, తహసీల్దార్ గంగాభవాని, ఎంపీడీఓ ఉమాదేవి, ఏఓ శ్రీవివాస్. డీటీ. కరుణాకర్ రావు. ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి. మండల సర్వే అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
Published On: January 18, 2025 8:17 pm
