సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరం అని, యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉందని, పరిమిత వేగంతో వెళ్లాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…శీతాకాలంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరి, పొగమంచు దట్టంగా కమ్ముకొని రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితులు ఏర్పడుతాయని, ఈ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా మంచు మరింత దట్టంగా మారి, ఉదయం 8గంటల వరకూ రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ఈ సమయాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని అన్నారు. వాహనాలకు లైట్లు వేసుకున్నా.. కొంత దూరంలో ఉన్న వాహనాలు కూడా దగ్గరకు వచ్చే వరకు కనిపించవని, వేగంగా ప్రయాణిస్తే యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. పరిమిత వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాలు జరగకుండా నివారించుకునే అవకాశం ఉంటుందని, అధిక వేగంతో ప్రయాణిస్తూ.. సడన్ బ్రేక్ వేయడం వల్ల బోల్తా పడడం, ఇతర వాహనాలను ఢీకొట్టడం వంటి ప్రమాదాలు జరుగుతాయని, తక్కువ స్పీడ్లో ఉంటే ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించి అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుందని ఎస్పీ సూచించారు. చలికాలంలో వాహనాలు నడుపేటప్పుడు హెడ్లైట్లు, ఇండికేటర్లు తప్పనిసరిగా ఆన్లో ఉంచాలని, అత్యవసరమైతే తప్ప, రాత్రులలో, పొగమంచు తీవ్రంగా ఉన్న సమయాల్లో ప్రయాణాలు చేయకుండా ఉండాలని అన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సెట్ బెల్ట్ ధరించవలసిందిగా సూచించారు. ముఖ్యంగా రైతులు వరి ధాన్యం కుప్పలను రోడ్లపై ఆరబెట్టకూడదని ఎస్పీ హెచ్చరించారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం ప్రమాదాలకు దారి తీస్తుందని, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారని, దీనివల్ల ప్రమాదాలు జరిగితే సంబంధిత రైతులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున రైతులు ధాన్యం కుప్పలను రహదారులపై పోవకుండా, కల్లాలను లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు.
పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరం.. యాక్సిడెంట్లు జరిగే అవకాశం: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Published On: November 18, 2025 8:09 pm