**డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: కీసర సీఐ శ్రీనివాస్**
**విఎంఆర్ గ్రామర్ హైస్కూల్లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం**
మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం జూన్ 30
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని కీసర సీఐ శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోమవారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మద్గూడ గ్రామంలోని విఎంఆర్ గ్రామర్ హైస్కూల్లో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒక్కసారి డ్రగ్స్కు బానిసైతే శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రమాదం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు, విదేశాల్లో ఉన్నత చదువులు, వీసాలు అన్నీ దూరం కావచ్చు” అని హెచ్చరించారు.
డ్రగ్స్ కేసులో ఒక్కసారి కూడా పట్టుబడితే జీవితమే అంధకారంలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంటుందన్నారు. డ్రగ్స్ వ్యతిరేకంగా విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.
“తమ పరిసరాల్లో డ్రగ్స్, గంజాయి వినియోగం, విక్రయం లేదా తరలింపు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రతి యువతుడు యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మారాలి” అని ఆయన పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణలో పోలీసులు ఎప్పుడూ ప్రజలతోపాటు ఉన్నారని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ కె. లక్ష్మణ్, విఎంఆర్ స్కూల్ కరస్పాండెంట్ మల్లికార్జున్ రెడ్డి, హెడ్మాస్టర్ సుజాత, నేషనల్ బంజారా మిషన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ నాయక్, జిల్లా అధ్యక్షుడు రవిరాజ్ రాథోడ్, మురళి నాయక్, మల్లేష్, హరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.