భారతదేశ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషణ

ప్రపంచీకరణ  భారతదేశ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషణ

ప్రభాత్ పట్నాయక్

IMG 20241013 WA0004

ప్రభాత్ పట్నాయక్ పాలకవర్గ భావజాల కారడవిలో రగిలిన కార్చిచ్చు. పీడిత ప్రజల నిరాశా, నిట్పూరులను అక్షరాయుధాలుగా మలుస్తున్న మేధో యోధుడు. నిజానికి ఆయన ఒక ‘ఏక వ్యక్తి సైన్యం! ప్రపంచంమీద కొనసాగుతున్న ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని ప్రతిఘటించే పోరాటాలకు మార్గదర్శి. ఆయన కలం నుంచి వెలువడుతున్న అగ్ని గోళాలవంటి వ్యాసాలు బూర్జువా సిద్ధాంతవేత్తల గుండెల్లో మరఫిరంగులై పేలుతున్నాయి. ఈ గ్రంథంలో దాదాపు 60వ్యాసాలున్నాయి. ముందుగా పెట్టుబడిదారీ వ్యవస్థకు సామ్రాజ్యవాదానికి ఉన్న అవినాభావ సంబంధం గురించిన విశ్లేషణ ఉన్నది. ఆ తరువాత నయా ఉదారవాదం, అది విస్తృతంగా ప్రభావితం చేసిన రంగాలకు సంబంధించిన వ్యాసాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ రాజకీయాలను ప్రభాత్ పట్నాయక్ విశ్లేషించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.

 

ప్రభాత్ పట్నాయక్ ఆక్స్ఫర్డ్లో చదివాడు. కేంబ్రిడ్జ్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాలలో 40ఏళ్ళు ఆర్థిక శాస్త్రాన్ని బోధించాడు. ప్రపంచ ఫైనాన్షియల్ వ్యవస్థను సంస్కరించటానికి జోసెఫ్ స్టిగ్లిజ్ అధ్యక్షతన ఐక్యరాజ్య సమితి నియమించిన నలుగురు సభ్యుల హై పవర్ టాస్క్ ఫోర్స్లో ప్రభాత్ వట్నాయక్ ఒకరంటే ఆయనేమిటో తెలుస్తుంది.

 

ఈ గ్రంథాన్ని అనువదించిన నెల్లూరు నరసింహా రావు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ‘అంతర్జాతీయ రాజనీతి శాస్త్రం’లో ఎన్ఏ, ఎమ్ఫిల్ చేశారు. ‘మార్క్సిస్టు పదకోశం’, ‘ఎన్ఆర్ పద్ధతి-తెలుగు వాచకం(వారంలో తెలుగు)’ గ్రంథాలను రచించారు. ప్రస్తుతం ప్రజాశక్తి దినపత్రికలో సహాయ సంపాదకుడిగా ఉన్నారు.

 

విషయ సూచిక

 

*1 పెట్టుబడిదారీ విధానం-సామ్రాజ్యవాదం

 

*2 సామ్రాజ్యవాదం తీరుతెన్నులు.

 

*3 ముంచుకొస్తున్న మాంద్యం ముప్పు.

 

*4 కోలుకునే దారేది? పెను సంక్షోభం 

     ఊబిలో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ.

 

*5దీర్ఘకాలిక సంక్షోభంలో పెట్టుబడిదారీ

   విధానం

 

*(6) ప్రపంచ ఆర్థిక సంక్షోభం తీరుతెన్నులు.

 

*(7) నయా ఉదారవాద ‘అభివృద్ధి’ 

       నిజ స్వరూపం.

 

*(8) నయా ఉదారవాద ప్రభావం తీరుతెన్నులు

 

*(9) దారిద్ర్యాన్ని పెంచిపోషిస్తున్న 

      నయా ఉదారవాదం

 

*(10) సంపద అసమానతల అసాధారణ

       పెరుగుదల

 

*(11)నయా ఉదారవాద రాజ్యం రూపురేఖలు

 

*(12) నయా ఉదారవాద రాజ్య నిర్మాణం

 

*(13) నయా ఉదారవాద పదఘట్టనల 

        కింద నలుగుతున్న ప్రజాస్వామ్యం

 

*(14) నయా ఉదారవాదం – అవినీతి, 

       అస్తిత్వ ఉద్యమాలు.

 

*(15) మరణశయ్యపై నయా ఉదారవాదం

 

*(16) పెట్టుబడిదారీ వ్యవస్థలో 

        డబ్బు ప్రాధాన్యత.

 

*(17) పెట్టుబడిదారీ వ్యవస్థలో 

        పెరుగుతున్న పేదరికం.

 

*(18) తృతీయ ప్రపంచ ఉత్థాన పతనాలు.

 

*(19) ద్రవ్య ఛాందసవాద పునరుత్థానం

 

*(20) సంక్షోభానికి కారణం ద్రవ్య భ్రష్టత్వమా?

 

*(21) దవ్యోల్బణాన్ని పెంచుతున్నదెవరు?.

 

*(22) ప్రతి ద్రవ్యోల్బణం ముప్పు

 

*(23) సంక్షోభంలోనూ ఉరకలెత్తుతున్న

       స్టాక్ మార్కెట్.

 

*(24) ఆర్థిక వ్యవస్థ అనుసరించాల్సిన 

       మార్గం ఏది?.

 

*(25) రెండు మార్గాలు

 

*(26) సంపదపై పన్ను.

 

*(27)తిరోగమన ఆదాయ పునఃపంపిణీ

        దుష్ఫలితాలు.

 

* (28) సంపద, ఆదాయ అసమానతల గురించి

 

*(29) వృద్ధి – పునఃపంపిణి- ఏది ముఖ్యం?.

 

*(30) ప్రభుత్వంపై ఆధారపడ కూడదా ?

 

*(31) రైతు ఆత్మహత్యలను అర్థంచేసుకోలేని

       ఆర్బిఐ గవర్నర్

 

* (32) కోతపడుతున్న సామాజిక రంగ

        వ్యయం.

 

*(33) హక్కుగా సార్వజనీన వృద్ధాప్య పెన్షన్

 

*(34) బూమ్ సమయంలో ఉపాధి

 

*(35) పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికుల 

       మధ్య వివక్ష.

 

*(36) వ్యాపారంగా మారిన విద్య

 

*(37) విద్యార్థులకు ఇచ్చే అప్పుల

         తీరుతెన్నులు .

 

*(38) విద్యపై నయా ఉదారవాద దాడి

 

*(39) సంపద పునః పంపిణీకి

       వ్యతిరేకంగా తిరుగుబాటు

 

*(40) మనముందున్న రెండు

        ప్రత్యామ్నాయాలు

 

*(41) దళితులు – పౌష్టికాహారలోపం .

 

*(42)నెహ్రూ ఆర్థిక వ్యూహం – నిజానిజాలు

 

*(43)2014 – 15 మధ్యంతర బడ్జెట్

     – యుపిఏ హంసగీతి.

 

*(44)కార్పొరేట్ కాపిటల్కు దాసోహమంటున్న

      బిజెపి ప్రణాళిక.

 

*(45) కార్పొరేట్ పెట్టుబడిదారుల 

       దళారి – మోడి.

 

*(46) మోడీ అభివృద్ధి వ్యూహం .

 

*(47) గుజరాత్ ఆర్థికాభివృద్ధి మార్గం.

 

*(48) పేదల సంక్షేమంపై వేటు ఎవరి కోసం?.

 

*(49) పౌరులను యాచకులుగా 

        మారుస్తున్న స్వచ్ఛ భారత్.

 

*(50) ఔషధ ధరలపై నియంత్రణ ఎత్తివేత.

 

*(51)భారత సమాజం – సాంఘిక 

        ప్రతీఘాత విప్లవ భూతం

 

* (52) బ్రిక్స్ బ్యాంకు స్థాపనలో

        సంతోషించటానికేముంది?

 

* (53) పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి 

        పోప్ ఫ్రాన్సిస్.

 

*'(54) నిర్-డాలరీకరణ’ దిశగా 

       పుతిన్ అడుగులు

 

*(55) ప్రపంచ వాణిజ్య సంస్థ – 

        వ్యవసాయ సబ్సిడీ.

 

* (56)1997 తూర్పు ఆసియా 

        2013 భారతదేశం.

 

*(57) అర్జెంటీనా అప్పు కథాకమామిషు

 

*(58) ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య

       ఒప్పందం – సామ్రాజ్యవాద నూతన రూపం

 

*(59) దిల్మా విజయం- అమెరికా 

      మీడియా తీరు

 

*(60) అంతరించిపోయిన ఉదారవాదులు

 

*(61) మార్క్సిజం అజరామరం!.

 

*(62) మార్క్సిజంతో అలసిపోయారా?

 

__________________________________

 

 

*రచయిత జీవిత విశేషాలు

 

ప్రభాత్ పట్నాయక్ ప్రముఖ అర్థశాస్త్రవేత్త, రాజకీయ విశ్లేషకుడు. ఆయన ఒరిస్సా రాష్ట్రంలోని జత్నిలో 1945 సెప్టెంబరులో జన్మించారు. అదే పట్టణంలో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత భారత ప్రభుత్వ మెరిట్ స్కాలర్షిప్పై ఇండోర్లోని డాలి కళాశాలలో చదివారు. ఎకనామిక్స్ ఆనర్స్తో తన బి.ఏ.డిగ్రీని ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో పూర్తిచేసి 1966లో రోడ్స్ స్కాలర్షిప్పై ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు. ఆ విశ్వవిద్యాలయానికి చెందిన బాలియోల్, న్యూఫీల్డ్ కాలేజీలలో బి.ఫిల్, డి. ఫిల్ డిగ్రీలు తీసుకున్నాడు.

 

ప్రభాత్ పట్నాయక్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పూర్తిచేసిన తరువాత 1969లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ఆర్థిక, రాజనీతిశాస్త్ర విభాగంలో అధ్యాపకుడుగా చేరారు. 1974లో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ‘అర్థశాస్త్ర విభాగం’లో అధ్యాపకుడుగా చేరారు. అదే విశ్వవిద్యాలయంలో 2010దాకా అర్థశాస్త్రాన్ని బోధించి, పదవీ విరమణ చేశారు. 2006 నుంచి 2011దాకా ఆయన కేరళ ప్రణాళికా బోర్డుకు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అనేక గ్రంథాలను రచించిన ప్రభాత్ పట్నాయక్ ‘సోషల్ సైంటిస్ట్’ జర్నల్ సంపాదకుడిగా కూడా ఉన్నారు.

 

నయా ఉదారవాద ఆర్థిక విధానాలను, అనేక రంగాలపై వాటి ప్రభావాన్ని సునిశితంగా పరిశీలించి ప్రజల దృక్కోణం నుంచి అత్యున్నత స్థాయిలో విమర్శనాత్మక విశ్లేషణ చేస్తున్న ప్రపంచ స్థాయి మేధావుల్లో ప్రభాత్ పట్నాయక్ ఒకరు. ప్రపంచ ఫైనాన్షియల్ వ్యవస్థను సంస్కరించటానికి ఐక్యరాజ్య సమితి నియమించిన నలుగురు సభ్యుల హై పవర్ టాస్క్ ఫోర్స్లో ప్రభాత్ పట్నాయక్ ఒకరు. జోసెఫ్ స్టిగ్లిజ్ అధ్యక్షుడిగా ఉన్న ఈ టాస్క్ ఫోర్స్లో ప్రభాత్తోపాటుగా బెల్జియన్ సామాజిక శాస్త్రవేత్త ఫ్రాంకో హౌటార్ట్, ఈక్వడార్ ఆర్థిక మంత్రి పెడ్రో పయెజ్ ఉన్నారు.

 

రాజకీయ అర్థశాస్త్రంలోను, స్థూల అర్థశాస్త్రంలోను నిష్ణాతుడైన ప్రభాత్ పట్నాయక్ అనేక గ్రంథాలను రచించారు. లెక్కకుమించిన వ్యాసాలు రాశారు. ఆయన

 

రాసిన గ్రంథాలలో కొన్ని:

 

Time, Inflation and Growth (1988), Economics and Egalitarianism (1990), Whatever Happened to Imperialism and Other Essays (1995), Accumulation and Stability Under Capitalism (1997), and The Retreat to Unfreedom (2003).

అనువాదకుడి మాట

 

ప్రభాత్ పట్నాయక్ ‘పీపుల్స్ డెమోక్రసీ’లో వారంవారం రాసిన వ్యాసాలను ‘ప్రజాశక్తి’ కోసం గత రెండు సంవత్సరాలుగా అనువదిస్తున్నాను. అత్యంత సంక్లిష్ట విశ్లేషణలను ఇముడ్చుకోగలిగే మహావాక్య నిర్మాణం ఆయన రచనలనిండా ఉంటుంది. ప్రభాత్ ప్రపంచ స్థాయి మేధావి. ఒక స్థాయినిదాటి విషయాన్ని సరళీకరించలేడు. దానికి కారణం విషయంలోని సంక్లిష్టతే. అలాంటి భావ సంక్లిష్టతను ఒక భాష నుంచి మరో భాషలోకి మార్చటం అంత తేలిక కాదు. మార్క్స్ రచనలను ఆంగ్లంలోకి అనువదించినప్పుడు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు.

 

మార్మ్స్ రాసిన ‘పెట్టుబడి’ గ్రంథం మొదటి సంపుటి 1867లో జర్మన్ భాషలో ప్రచురింపబడింది. ఈ మహా గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించేందుకు ఒక అనువాదకుడి కోసం మార్క్స్, ఎంగెల్లు ఆంగ్లం మాట్లాడే దేశాలన్నింటా గాలించారు. అందుకోసం 20 సంవత్సరాలు వేచి చూడవలసి వచ్చింది. అప్పటికే మార్క్స్ ‘పెట్టుబడి’ని జర్మన్లో మూడుసార్లు ప్రచురించాడు. 1883లో మార్క్స్ మరణించాడు. ఆయన జీవిత కాలంలో ‘పెట్టుబడి’ ఆంగ్ల భాషలోకి అనువాదం కాలేదు. అంతకు 10 సంవత్సరాల ముందు ‘పెట్టుబడి’ని అనువదించటానికి అమెరికాలో ప్రయత్నం జరిగింది. అయితే సరియైన అనువాదకుడు దొరకక అది ముందుకు సాగలేదు. ఆ తరువాత ఎంగెల్స్ మాంచెస్టర్లో న్యాయవాదిగా ఉన్న శామ్యూల్ మూర్ను ‘పెట్టుబడి’ని ఆంగ్లంలోకి అనువదించమని కోరాడు. ఈయన అంతకు ముందు ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను అనువదించాడు. ఆయన కూడా రకరకాల కారణాల చేత ఆ పని పూర్తిచేయలేక పోయాడు. చివరకు కావలసిన అనువాదకుడు మార్క్స్ ఇంట్లోనే దొరికాడు. ఆయనే ఎడ్వర్డ్ ఎవలింగ్. ఆయన మార్క్స్ చిన్నకూతురు ఎలినార్ భర్త. ఈయన సామర్థ్యం కూడా అంతంత మాత్రమే. ఈ ఇద్దరి అనువాదకుల అనువాదాలను ఎంగెల్స్ సమన్వయం చేసి, సరిదిద్దాడు. ఈ విషయాలను తన ‘ముందుమాట’లో ఎంగెల్స్ రాశాడు. ‘పెట్టుబడి’ అనువాదాన్ని మొత్తంగా ఆంగ్లం, జర్మన్ భాషలలోని ఉటంకింపులన్నింటినీ ఎలినార్ మార్క్స్ సరిపోల్చి చూసింది. ఈ విషయంలో ఆమె పోషించిన కీలక పాత్రను ఎంగెల్స్ తన ‘ముందుమాట’లో ప్రస్తావించాడు. మాస్కోలోని ప్రగతి ప్రచురణాలయం ముద్రించిన ఈ గ్రంథమే నేటికీ అందరికీ అందుబాటులో ఉన్నది. ‘పెట్టుబడి’ ఆంగ్లంలో మొదటిసారి ప్రచురింపబడిన తరువాత 109సంవత్సరాలకు పెంగ్విన్ సంస్థ 1976లో ఎర్నెస్ట్ మాండెల్ పరిచయంతో బెన్ ఫాక్స్, డేవిడ్ ఫెర్న్ బాక్ చేసిన సమగ్ర అనువాదాన్ని ప్రచురించింది.

 

ఒక అత్యున్నత స్థాయి మేధావి రచనలను అనువదించటంలోగల సంక్లిష్టత ఏ స్థాయిలో ఉంటుందో తెలియజేయటానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ప్రభాత్ పట్నాయక్ గత 40ఏళ్ల నుంచి ప్రజల పక్షాన రాస్తూనే ఉన్నాడు. ఆయన వ్యాసాలు అనేకం అనువదించబడ్డా అవి ఇప్పటిదాకా గ్రంథ రూపంలో రాలేదు. అవి గ్రంథంగా తెలుగులో ప్రచురింపబడటం ఇదే తొలిసారి. ఈ విషయం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.

 

ఈ గ్రంథంలో దాదాపు 60వ్యాసాలున్నాయి. ముందుగా పెట్టుబడిదారీ వ్యవస్థకు సామ్రాజ్యవాదానికి ఉన్న అవినాభావ సంబంధం గురించిన విశ్లేషణ ఉన్నది. ఆ తరువాత నయా ఉదారవాదం, అది విస్తృతంగా ప్రభావితం చేసిన రంగాలకు సంబంధించిన వ్యాసాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ రాజకీయాలను ప్రభాత్ పట్నాయక్ విశ్లేషించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అమూల్య ఆర్థిక వ్యాసాలు..తమ్మినేని వీరభద్రం సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి..ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ రాసిన వ్యాసాలు తెలుగులో మొదటిసారి సంకలనంగా రావడం చాలా సంతోషకరమైన విషయం. సమకాలీన భారత దేశంలోనే గాక ప్రపంచ స్థాయిలో కూడా ప్రజల పక్షాన నిలిచే ప్రగతి శీల మేధావి, ఆరితేరిన ఆర్థిక వేత్త ఆయన. ప్రపంచ ద్రవ్య వ్యవస్థను సంస్కరించటానికి ఐక్యరాజ్య సమితి జోసెఫ్ స్టిగ్లిజ్ అధ్యక్షతన నియమించిన నలుగురు సభ్యుల ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్లో ప్రభాత్ పట్నాయక్ ఒకరంటే ఆయన స్థాయి ఏమిటో అర్థమవుతుంది. ప్రత్యేకించి నయా ఉదార వాద ఆర్థిక విధానాల నయ వంచనను పటాపంచలు చేసే విశ్లేషణ ఆయన స్వంతం. ఒక్క అక్షరం వృథా పోకుండా తన రచనను ఆమూలాగ్రం అర్థవంతమైన సమాచారంతో నింపడం ఆయనకే చెల్లింది. నిజానికి ప్రత్యేకంగా ఒక ముందు మాట అంటూ అవసరం లేని మహా మేధావి ఆయన. అయితే ఆయన రచనల వల్ల, విశ్లేషణల వల్ల అవగాహన పెంచుకుంటున్న ఎంతోమంది ప్రజా ఉద్యమ కారుల ప్రతినిధిగా అభినందనలు తెల్పడానికే ఈ ప్రయత్నం.

 

ఆకర్షణీయమైన పదజాలం ఆధిపత్య భావజాలానికి మేలిముసుగుగా ఉపయోగపడుతూ ఉంటుంది. దేశాల మధ్య, ఆయా దేశాలలో ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను అగాధంగా పెంచే వర్తమాన ఆర్థిక విధానాలకు పాలక వర్గ మేధావులు అలాటి అందమైన పదాలెన్నో సృష్టించారు. ప్రపంచ కుగ్రామం, అభివృద్ధికి ఆంక్షల తొలగింపు, అవకాశాల విస్తరణ, పాత కాలపు భావాలనుంచి బయిటపడటం, ప్రపంచ వేగాన్ని అందుకోవడం, నాణ్యతతో కూడిన సేవలు, ద్రవ్యపరమైన క్రమశిక్షణ తదితర పదాల పరదాల చాటున పబ్బం గడుపుకొంటున్నారు. అధికార, అనధికార ఆర్థిక వేత్తలూ, మన్మోహన్లూ, చిదంబరాలూ, అరుణ్ జైట్లీలూ ఈ పనిలో గొప్ప సేవకులుగా తరిస్తుంటారు. ఆర్బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వంటివారు ఎన్ని ప్రసంగాలు చేసినా వ్యవస్థ చలన సూత్రాలను మించి మాట్లాడలేరు. పైగా నష్టదాయకమైన అంశాలు ప్రజానుకూల విజయాలుగా చిత్రిస్తుంటే సామాన్యులే గాక విద్యాధికులు కూడా గజిబిజికి గురవుతున్న స్థితి ఏర్పడుతున్నది. ఇలాటి సందర్భంలో విషయ సంపన్నమైన, విశ్లేషణాత్మకమైన ప్రభాత్ పట్నాయక్ వంటివారి రచనలే మనకు వున్నది వున్నట్టు తెలియజేసే కరదీపికలవుతాయి. ఆ కోణంలో ఈ వ్యాస సంపుటిని ఆహ్వానించడమే గాక దీనిని అందరూ అధ్యయనం చేయాలని ఆకాంక్షిస్తున్నాను. అందుకు అన్ని స్థాయిల్లో నాయకులు, కమిటీలు, సంఘాలు కృషి చేయాలని కోరుతున్నాను.

 

ఇప్పుడు గొప్పగా అనునిత్యం కీర్తించబడే ప్రపంచీకరణ వాస్తవానికి సామ్రాజ్యవాద ప్రపంచీకరణే, కాని చాలా మంది పాలక పక్ష మేధావులు, ఆర్థిక వేత్తలు సామ్రాజ్యవాదం వంటి పదాలకు కాలం చెల్లిపోయిందని సుద్దులు చెబుతుంటారు. అవెంత బూటకమో ప్రభాత్ పట్నాయక్ ఈ వ్యాసాల్లో నిరూపించారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో రూపం ఏదైనా ప్రపంచాధిపత్య వ్యూహం అనివార్యమైన అవసరం. సామ్రాజ్యవాదాన్ని గురించి మాట్లాడటం ఇప్పుడు మరింత అవసరం. సామ్రాజ్యవాదంలేని పెట్టుబడిదారీ వ్యవస్థను ఊహించటమే సాధ్యంకాదని ప్రభాత్ విశ్లేషించాడు. వలస కాలంలో బ్రిటన్ ప్రధాన శక్తిగా ఉన్నప్పుడు చమురులాంటి వనరులను ఉత్పత్తి చేస్తున్న దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రత్యక్ష పెత్తనంతో సరఫరాను నియంత్రించింది. వర్తమానంలో ఈ నియంత్రణ రాజకీయ ప్రాబల్యంతో నిశ్చయమవుతున్నది. ఇరాక్ వంటి చోట్లనైతే ఇప్పుడు కూడా వలస తరహా ప్రత్యక్ష నియంత్రణకు ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఆ వ్యవస్థకు నాయకత్వం వహించే దేశం మారవచ్చు కానీ దాని అదుపాజ్ఞలు, అజమాయిషీలు అలాగే వుండడం వారికి అవసరం. ఈనాడు ప్రపంచీకరణ శకంలో మూడవ ప్రపంచ దేశాలలోని బూర్జువా వర్గం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారీ వర్గంతో చాలా వరకూ కలగలసి పోతున్నది. అయినప్పటికీ అగ్రరాజ్యకూటమి మూడవ ప్రపంచ దేశాల వనరులను, ఉత్పత్తులను అదుపుచేస్తూనే వుంటుంది. మూడవ ప్రపంచ దేశాలలోని ఉద్యోగులు, కార్మికుల ఆదాయాలను దిగ కోస్తూనే వుంటుంది. తన సరుకులను అక్కడకు పంపి దేశీయ మార్కెట్లను కబళిస్తూనే వుంటుంది. వీటన్నిటినీ సాగించేందుకు కావలసిన యంత్రాంగం పేరే సామ్రాజ్యవాదం అని ప్రభాత్ పట్నాయక్ కుండబద్దలుకొట్టి చెబుతాడు. అలాటి సామ్రాజ్యవాదంపట్ల సన్నాయి నొక్కులు గాక సమరశీల అవగాహన అవశ్యమంటాడు. పైగా దీనివల్ల సంపన్న దేశాలలో కార్మికుల వేతనాలు పెరగకుండా అడ్డుకోవడం కూడా జరుగుతుంది. ఆ విధమైన అభద్రతావాతావరణం వారి పోరాటాలను, ఉద్యమాలను బలహీనపర్చే సాధనమవుతుంది. కనుక ఈ విధానాలతో ఒక్కదెబ్బకు రెండు పిట్టల్లా అంతర్జాతీయ సామ్రాజ్యవాదం ద్వంద్వ ప్రయోజనాలు సాధించుకుంటుందని విశదపరుస్తాడు ప్రభాత్. అభివృద్ధి చెందిన దేశాలలో శ్రామిక ఉత్పాదకతతోపాటుగా కార్మికుల వాస్తవ వేతనాలు ఇకపై పెరగవు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో శ్రామిక ఉత్పాదకత పెరిగినప్పటికీ వాస్తవ వేతనాల సదిశలో స్తబ్ధత ఏర్పడటం అంటే మిగులు విలువ భాగం పెరిగిందనటానికి అంతస్సూచన అని చెప్పవచ్చు. అంటే ప్రపంచంలో ఆర్థిక అసమానతలు పెరిగాయన్నమాట’. ప్రపంచీకరణ పేరుతో చలామణీ అవుతున్న నయా ఉదారవాద శకంలో కార్మికులూ, ఉద్యోగులూ నిరంతరం నిరుద్యోగం పడగ నీడలో జీవిస్తున్నారంటే కారణం అదే.

 

అంతకన్నా దారుణం ఏమంటే సంపదలు అపారంగా పెంచే సాధనంగా ప్రచారం పొందిన నయా ఉదారవాద విధానాల ఫలితంగా దారిద్య్రం పెరగడం! అధికారికంగా జరిగిన నేషనల్ శాంపుల్ సర్వేనే ఇందుకు ఆధారంగా వుండటం ఆసక్తికరమైన విషయం. కనుక ఆర్థికాభివృద్ధి జరిగినంత మాత్రాన దారిద్య్ర్యం పోతుందని చెప్పలేం. నయా ఉదారవాదంలో పెరిగే దారిద్య్రం వ్యవస్థీకృత ఉత్పాదితం. దీని మూలాలు ఆర్థిక విధానంలో ఉంటాయి- అంటూ ఆయన చేసిన సూత్రీకరణ ఒక హెచ్చరిక. ఎవరు ఏ పనైనా చేసేందుకు స్వేచ్చ లభించినట్టు చెబుతున్నా వాస్తవంలో కొన్ని తరగతుల శ్రామికులు కొన్ని వృత్తులలో బందీలై వుంటారు. ప్రత్యక్ష, పరోక్ష వివక్షకు గురవుతుంటారు. వారి పనిపరిస్థితులు, ప్రతిపలం కూడా పరమ నికృష్టంగా వుండిపోతాయి. కాంట్రాకు, ఔట్ సోర్సింగ్ వంటి పేర్లతో కార్మికులలో ఒక ‘అణగారిన’ తరగతిని ఎల్లవేళలా అభద్రతలో వుంచేస్తారు.

 

ఈ క్రమంలో దారుణంగా చితికిపోయే మరో రంగం వ్యవసాయ రంగం. రైతాంగం ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరల లేమి, పరపతి అందకపోవడం, సబ్సిడీల కోత వంటి సమస్యలు మనం రోజూ చూస్తుంటాం. వీటికి బాధ్యత తీసుకోవడానికి పాలకులు ముందుకు రారు. పైగా ప్రపంచ వాణిజ్య సంస్థ వ్యవసాయ సబ్సిడీలు రద్దు చేయాలని వెంటపడుతుంది. రైతాంగం చితికిపోవడం ఒకటైతే వ్యవసాయ కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారడం మరో ముఖ్యమైన అంశం. కాని పెద్ద పెద్ద ఆర్థిక సిద్ధాంతాలు వల్లెవేసే పండితులు దీనికి ఎంతమాత్రం ప్రాధాన్యత నివ్వరు. ప్రొఫెసర్ ప్రభాత్ వ్యాసాలలో వీటికి సమాధానం దొరుకుతుంది. సమస్యలతో పాటుగానే ద్రవ్య లోటు, ద్రవ్య శిక్షణ, ఆర్థికాభివృద్ధి, గాలిబుడగ, మాంద్యం, రూపాయి విలువ పతనం, వివిధ దేశాలలో ద్రవ్య పరమైన ఒడుదుడుకులు తదితర అంశాలు కూడా అచ్చమైనే

ఆర్థిక వేత్త లాగే ఆయన మనకు ఎరుకపరుస్తారు. కాకపోతే భూకంపాలు, ప్రభుత్వ పతనాలు అన్నట్టు ఈ ఆర్థిక తుపానుల వెనకగల విధాన సూత్రాలేమిటో తేటతెల్లం చేస్తాడు. ప్రజల కొనుగోలు శక్తి పెరగక, చేసిన ఉత్పత్తులు అమ్ముడవక నిజమైన అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నిస్తాడు.

 

ఇలాంటి పెట్టుబడిదారీ వ్యవస్థ నయా ఉదారవాదాన్ని నెత్తికెత్తుకున్న మన పాలక వర్గాలు- యుపిఎ, ఎన్డీఎ, ప్రాంతీయ పార్టీలు ఏవైనా- ఒకేగాడిన నడుస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ముందు మోకరిల్లుతున్నాయి. ఈ ప్రభావం రాజకీయాలపైనా పడి దేశంలో అసలే అంతంత మాత్రంగా ఉన్న ప్రజాస్వామ్యాన్ని మరింతగా కుంగదీసింది. రాజ్యాంగం నిర్దేశించిన విధంగా కాకుండా చట్ట సభలకూ, న్యాయ వ్యవస్థకూ అతీతంగా కార్యనిర్వాహక వర్గం- అంటే ప్రభుత్వానికి ఆధిపత్యం వహించే రాజకీయ నాయకత్వం- సర్వాధికారం చలాయించే పరిస్థితి ఏర్పడింది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మన్మోహన్ తరహా విధానాలే మరింత జోరుగా అమలు చేయడం మన కళ్లముందు జరుగుతున్నదే. ఇందుకోసం అతి కీలకమైన అంశాల్లో ఆర్డినెన్సులు జారీ చేసినా చెల్లిపోతున్నది. అంటే గత 100సంవత్సరాల కాలంలో వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటం, ఆ తరువాత అనేక ప్రజస్వామిక పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కుల మీదా దాడి జరుగుతున్నది. ఈ మార్కెట్ ఛాందసం రాజకీయ క్షేత్రంలో మతతత్వ-ఫాసిజం రూపంలో లౌకిక ప్రజాస్వామ్యాన్ని మరింతగా దెబ్బతీస్తున్నది. వీటన్నిటి మధ్యనా అంతస్సంబంధం ఏమిటో ఈ పుస్తకంలోని వ్యాసాలు మనకు చెబుతాయి.

 

ఈ విధంగా అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడితో మమేకమయిన పాలకవర్గాలు బూటకపు ‘అభివృద్ధి’ పేరుతో ప్రజలను మాయచేసి దోచుకుంటున్నాయి. చీలుస్తున్నాయి. ఇందుకు భిన్నంగా ప్రజలను రాజకీయంగా చైతన్యవంతులనుచేయడం వామపక్షాల ప్రప్రధాన కర్తవ్యంగా వుంది. అటు దేశ ఆర్థిక సార్వభౌమత్వం, ప్రజల జీవిత ప్రమాణాలు కాపాడుకోవడం మరోవైపున వారి ప్రజాస్వామిక హక్కుల రక్షణ – ద్విముఖ కర్తవ్యాలుగా వున్నాయి. మోడీత్వ మతతత్వ రాజకీయాలను ఢీకొని లౌకిక విలువలను రక్షించుకోవాలి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుగుతున్న సిపిఎం మహాసభల్లో ఇందుకు సంబంధించి వాస్తవాల క్రోడీకరణ, ఆచరణాత్మక విశ్లేషణ సాగుతున్నాయి. ఇతర శక్తులను కూడగట్టే కృషి జరుగుతున్నది. వరుసగా వచ్చే కుదుపులు, కొన్ని ప్రతికూల పరిణామాలు కూడా ప్రపంచీకరణ మేడిపండు స్వరూపం కొద్ది కొద్దిగా అర్థం అయ్యేలా చేస్తున్నాయి. ఆ అవగాహన ఎంతగా పెరిగితే ఆచరణ అంతగా పదునెక్కుతుంది. ఈ అధ్యయనానికి, కార్యాచరణకూ కూడా ప్రభాత్ పట్నాయక్ వ్యాసాల సంకలనం ప్రజాస్వామ్యవాదులందరికీ ఒక సమగ్ర మార్గదర్శినిగా వుంటుంది. ఆ విధంగా ఈ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కోవలో స్థానిక అంశాలకు వీటిని అన్వయించి చూసుకుంటే మరింత సులభంగా అర్ధమవుతాయి.

 

ఈ వ్యాసాలు ప్రజాశక్తిలో వస్తున్నప్పుడే అధ్యయనశీలురైన పాఠకులను విశేషంగా ఆకర్షించాయి. అనేక చోట్ల వీటిపై అధ్యయన తరగతులు జరిగాయి. వారం వారం వీటిని అనువదించిన నెల్లూరు నరసింహారావు తన అనువాదం సుబోధకంగా సాగేందుకు శక్తికొద్ది ప్రయత్నించడం అభినందనీయం. ఈ పుస్తకం పాఠకుల ఆదరణతో మరిన్ని ముద్రణలు వస్తుందని విశ్వసిస్తున్నాను. తనమేధనూ, అధ్యయనాన్నీ అభ్యుదయ ఉద్యమాలకు, ప్రజా విముక్తి- వికాసాలకు అంకితం చేసిన ప్రభాత్ పట్నాయక్కు హృదయ పూర్వకంగా జేజేలు పలుకుతున్నాను

Join WhatsApp

Join Now