తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలకు విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాలని, ఈ పన్ను వసూలు చేసే బాధ్యతను జిల్లా విద్యాశాఖాధికారులకు (డీఈవో) అప్పగించారు.
ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ హెచ్చరించింది. అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచే పద్ధతికి అడ్డుకట్ట వేస్తూ, శాస్త్రీయంగా ఫీజులను నిర్ణయించే ప్రక్రియను విద్యాశాఖ అధికారులు వేగవంతం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 11 వేల ప్రైవేట్ పాఠశాలల్లో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు, గత మూడేళ్ల ఆదాయ, వ్యయాల వివరాలను సేకరించాలని అధికారులు నిర్ణయించారు.
ప్రభుత్వం ప్రతి రెండేండ్లకోసారి 8 శాతం మాత్రమే ఫీజు పెంచుకునేలా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై కసరత్తు జరుగుతోంది. ఎంఈఓ, డీఈఓల ద్వారా ఏ పాఠశాలలో ఎంత ఫీజు ఉంది? ఏయే తరగతులకు ఎంతెంత వసూలు చేస్తున్నారు? వంటి వివరాలను సేకరిస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో బేస్ ఫీజులను దేని ఆధారంగా నిర్ణయించాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ఫీజులకు సంబంధించిన ముసాయిదాను పబ్లిక్లోకి విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ముసాయిదాను పారదర్శకంగా వెబ్సైట్లో ఉంచి, తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రజల అభిప్రాయాలు, సూచనలు సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.

