కొత్త రైతులకూ ‘భరోసా’!

*_Rythu Bharosa: కొత్త రైతులకూ ‘భరోసా’!_*

జూన్‌ 5లోపు రిజిస్ట్రేషన్‌ అయి ఉంటే చాలు

ఏఈవోలకు ధ్రువపత్రాలు ఇస్తే పోర్టల్‌లో నమోదు

ఈ నెల 20వ తేదీ వరకు గడువు మూడు ఎకరాల వరకు రైతుభరోసా జమ!

హైదరాబాద్‌, జూన్‌ 18 కొత్తగా భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నెల 5ను కటాఫ్‌ తేదీగా పెట్టారు. అంటే ఈనెల 5లోపు క్రయవిక్రయాలు, మ్యుటేషన్‌ జరిగి, యాజమాన్య హక్కులు పొందిన రైతులకు రైతు భరోసాను వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ వానాకాలం (2025-26) సీజన్‌కు వచ్చేసరికి పాత రైతులతో పాటు కొత్త రైతులకు కూడా రైతు భరోసాను ఎలాంటి పరిమితులు విధించకుండా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. భూభారతి(ధరణి) పోర్టల్‌ ప్రకారం… రిజిస్ట్రేషన్‌ ఎవరి పేరుమీద ఉంటే వారికి రైతు భరోసా చెల్లించాలని, యాజమాన్య హక్కులు పొందిన రైతుల వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు.

అయితే 2023-24లో 6,32,898 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2024-25లో 5,87,313 భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటిలో కొందరు రైతులు రైతు భరోసా పథకంలోకి వచ్చారు. మరికొందరు రైతులను పథకంలో చేర్చలేదు. ఇప్పుడు వారందరికీ అవకాశం కల్పించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఏఈవోలు (వ్యవసాయ విస్తరణాధికారులు) రైతు భరోసా లబ్ధిదారుల నమోదు ప్రక్రియను చేపడుతున్నారు. సీసీఎల్‌ఏ నుంచి వచ్చిన డేటా ఆధారంగా రైతుల నుంచి ధ్రువపత్రాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. పట్టాదారు, బ్యాంకు పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు జిరాక్సు కాపీలను ఏఈవోలకు ఇస్తే… వారు రైతు భరోసా పోర్టల్‌లో రైతుల వివరాలు నమోదు చేస్తారు. ఈ వివరాల నమోదుకు ఈ నెల 20 వరకు గడువు ఇచ్చారు. అంటే మూడు రోజుల సమయం ఉంది. ఈ మూడు రోజుల్లో కొత్త రైతుల వివరాలు నమోదు చేస్తే వాళ్లు లబ్ధిదారుల జాబితాలోకి వస్తారు.

*_3 ఎకరాల వరకు రైతుభరోసా జమ!_*

*_రైతుల ఖాతాలకు 1,552 కోట్లు బదిలీ_*

*_2 రోజుల్లో రూ.3,902 కోట్ల నగదు_*

హైదరాబాద్‌, జూన్‌ 18 మూడెకరాల్లోపు వ్యవసాయ భూమి గల రైతులకు వారి ఖాతాల్లో రైతు భరోసా జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మూడెకరాల భూమి గల రైతులు 10.45 లక్షల మందికి 25.86 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఎకరానికి రూ.6,000 చొప్పున 10.45 లక్షల మంది రైతులకు రూ. 1,552 కోట్ల నగదు బదిలీ చేశారు. తొలి రోజు సోమవారం రెండెకరాల్లోపు భూమి గల 41.25 లక్షల మంది రైతులకు 39.16 లక్షల ఎకరాలకు రూ.2,350 కోట్ల నగదును సర్కారు బదిలీ చేసింది.

రెండు రోజుల్లో (16,17 తేదీల్లో)నే రాష్ట్ర ప్రభుత్వం 51.70 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రూ.3,902 కోట్ల నగదును బదిలీ చేసింది. ఎటువంటి పరిమితుల్లేకుండా రైతులందరికీ రైతు భరోసా చెల్లిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ పెట్టుబడి సాయాన్ని రైతులు వానాకాలం పంటల సాగుకు వినియోగించుకోవాలని సూచించారు. సుమారు 1.50 కోట్ల ఎకరాల భూమికి ప్రస్తుత సీజన్‌లో రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment