Site icon PRASHNA AYUDHAM

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి 

IMG 20241219 WA0248

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఐ డి ఓ సి కార్యాలయం లోని సమావేశ మందిరం లో రోడ్డు భద్రత పై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ వైకల్యం బారిన పడకుండా, ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు లేకుండా, రహదారి ప్రమాదాలు సంభవించకుండా రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాల వివరాలు నమోదు చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు. రోడ్లపై కేజీ వీల్స్ తిరగకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలు పూర్తిగా నివారించడానికి జాతీయ రహదారి పక్కల ఉన్న గ్రామాలలో పొలీసు కళా బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పొలీసు అధికారులకు సూచించారు.జిల్లా పరిధిలో ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను గుర్తించడం జరిగిందని, ఆయా ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు. అటవీ ప్రాంతం ఉన్న ప్రాంతాల్లో నెమ్మదిగా వెళ్లేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఓవర్ లోడింగ్ వాహనాలపై తగు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖాధికారికి సూచించారు.ట్రాఫిక్ నియంత్రణకు పనిచేసే ట్రాఫిక్ కానిస్టేబుల్ మైకులు మరియు కూలింగ్ హెల్మెట్లు కోసం ప్రతిపాదనలు సమర్పించాలని ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు. ఇల్లందు క్రాస్ రోడ్ లో లైటింగ్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈఈ కాశయ్య, నేషనల్ హైవేస్ ఈ ఈ యుగంధర్, జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, జిల్లా రవాణా శాఖ అధికారి సదానందం, డి సి హెచ్ ఎస్ రవిబాబు మరియు ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version