విఫలదేశం పాక్‌ .. అన్ని రంగాల్లోనూ ఫెయిల్‌ ..

*విఫలదేశం పాక్‌ .. అన్ని రంగాల్లోనూ ఫెయిల్‌ ..*

*రాజకీయ అస్థిరత్వం.. సైన్యం నియంత్రణ*

*నిరంకుశత్వం.. హక్కుల హననం.. మతపెద్దల బహిరంగ విమర్శలు*

*పతనం అంచున ఆర్థిక వ్యవస్థ..*

*ఐఎంఎఫ్‌ అప్పుతో నెట్టుకొస్తున్న వైనం*

*పహల్గాం తర్వాత అంతర్జాతీయంగా ఒంటరి..*

*ఐరాసలో అవమానం*

1947లో పంతంతో మన కన్నా ఒక రోజు ముందు (ఆగస్టు 14) స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది పాకిస్థాన్‌. కానీ, ఈ 8 దశాబ్దాల్లో ఒక విఫలదేశంగా ప్రపంచం ముందు నిలబడింది. రాజకీయ, ఆర్థిక, అంతర్గత భద్రత తదితర అంశాలతోపాటు పొరుగుదేశాలతో సంబంధాలు, అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ పూర్తిగా విఫలమై బాహ్య, అంతర్గత సమస్యలు, సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలహీనంగా ఉంది. సాధారణంగానే పాకిస్థాన్‌లో ప్రభుత్వాలను ఆ దేశ సైన్యం నియంత్రిస్తుంది.. ఇప్పుడిది మరింత అధికంగా కనిపిస్తోంది. జైళ్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు జనంలో మద్దతు పెరుగుతోంది. ఆయన పార్టీ (పీటీఐ) నేతృత్వంలో భారీ ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. దేశంలో కరడుగట్టిన నియంతృత్వం నెలకొందని, ప్రశ్నించే జర్నలిస్టులను, పౌరులను, ఇస్లామిక్‌ మత గురువులను కిడ్నాప్‌ చేసి హత్య చేస్తున్నారని పలువురు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఇస్లామాబాద్‌లోని ప్రఖ్యాత లాల్‌మసీదు ఇమాం అబ్దుల్‌ అజీజ్‌ ఘాజీ.. ఇటీవలి శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత్‌తో యుద్ధానికి సై అంటున్న నేతలు.. తమ స్వప్రయోజనాల కోసమే ఆ పని చేస్తున్నారని, అది ఇస్లామిక్‌ యుద్ధం కాదని పేర్కొన్నారు. మరోవైపు, పాకిస్థాన్‌ ఆర్థికరంగం కుప్పకూలటానికి సిద్ధంగా ఉంది. పాక్‌ రూపాయి దారుణంగా పతనమైంది. ఒక అమెరికా డాలర్‌కు 281 పాక్‌ రూపాయలు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) నుంచి పాకిస్థాన్‌ రుణం తీసుకుంటోంది. ఇప్పటికి రికార్డు స్థాయిలో 25 సార్లు అప్పు తీసుకుంది.

బలూచిస్థాన్‌ స్వాతంత్రోద్యమం

విస్తీర్ణం పరంగా పాకిస్థాన్‌లో అతిపెద్ద రాష్ట్రం బలూచిస్థాన్‌. అక్కడి ప్రాంతాల్లో అపారమైన సహజ వనరులున్నాయి. కానీ, తలసరి ఆదాయం ప్రకారం బలూచిస్థాన్‌ పాక్‌లో అత్యంత వెనుకబడిన రాష్ట్రం. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రంలో 70 ఏళ్లుగా స్వాతంత్రోద్యమం నడుస్తోంది. తమ వద్ద ఉన్న సహజ వనరులను పాక్‌ ప్రభుత్వం వాడుకుంటున్నప్పటికీ.. తమకు ఎటువంటి లబ్ధి చేకూరటం లేదని, తమను దోపిడీ చేస్తోందని.. పాక్‌ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించటమే ఏకైక మార్గమని బలూచ్‌ ప్రజలు భావిస్తున్నారు. బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ, బలూచ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌, మాజి ద్‌ బ్రిగేడ్‌ వంటి సంస్థలు పాక్‌ సైన్యంతోపాటు ఇతరత్రా లక్ష్యాల మీద తరచూ దాడులు జరుపుతున్నాయి. ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రంలోనూ పరిస్థితులు శాంతియుతంగా లేవు. ఆ రాష్ట్రంలోని వజీరిస్థాన్‌ తదితర ప్రాంతాల్లో తెహ్రీక్‌ తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. అనేక గ్రామాలను ఆక్రమించింది.

పొరుగు దేశాలతోనూ పోట్లాటలే

సొంత గడ్డపై తాలిబన్లను పెంచి పోషించిన పాక్‌.. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం వచ్చిన తర్వాత ఆ దేశంతో సంబంధాలు మెరుగుపడతాయని భావించింది. కానీ, దానికి విరుద్ధంగా ఇప్పుడు పాక్‌ తాలిబన్లు ఏకుమేకయ్యారు. అటు అఫ్ఘాన్‌తోనూ సంబంధాలు క్షీణించాయి. మరో పొరుగుదేశం ఇరాన్‌తోనూ పాకిస్థాన్‌కు స్నేహం లేదు. ఇరాన్‌లోనూ బలూచిస్థాన్‌ పేరుతో ఓ రాష్ట్రం ఉంది. అక్కడి బలూచ్‌ మిలిటెంట్లు పోలీసుల మీద దాడి చేసి 11 మందిని చంపటంతో.. పాక్‌లోని బలూచిస్థాన్‌ మీద ఇరాన్‌ గత ఏడాది జనవరిలో క్షిపణి, డ్రోన్‌ దాడులు జరిపింది. దీనికి ప్రతిగా పాక్‌.. ఇరాన్‌లోని బలూచిస్థాన్‌లో మిలిటెంట్ల స్థావరాల మీద వైమానిక దాడి జరిపింది. తాజాగా, పహల్గాం ఉగ్రదాడి అనంతరం అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ ఒంటరైంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోనే పాక్‌ ప్రతినిధి.. సభ్యదేశాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఈ విధంగా పాకిస్థాన్‌ ఓ విఫలదేశంగా తయారైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment