కొత్తగా మరికొందరు రైతులకు రైతుబీమా.. జూన్ 5 నాటికి పట్టా పాస్ బుక్ వచ్చిన వారికి వర్తింపు
*భూభారతి, సీసీఎల్ఏలో నమోదైన రైతులకు చాన్స్*
*గతంలో దరఖాస్తు చేసుకోని 5 ఎకరాలలోపు రైతులకు మరోసారి అవకాశం*
*రైతుబీమా తాజా మార్గదర్శకాలు విడుదల చేసిన వ్యవసాయ శాఖ*
*ఈ నెల 13తో ముగియనున్న పాత బీమా గడువు*
2025-26 సంవత్సరానికి సంబంధించిన రైతుబీమా ఈ నెల 14 నుంచి అమలు కానుండగా.. వ్యవసాయశాఖ కొత్త గైడ్లైన్స్ విడుదల చేసింది. ఈ నిబంధనల మేరకు కొత్త రైతుల నమోదు, రెన్యూవల్స్ చేపట్టాలని క్షేత్రస్థాయి అధికారులకు అగ్రికల్చర్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ 5 వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతుల్లో బీమాకు అర్హులైనవారిని వ్యవసాయ శాఖ గుర్తించనుంది.
భూభారతి లో నమోదై.. సీసీఎల్ఎల్ఏలో నమోదైన భూములు కలిగిన రైతుల్లో 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు బీమా పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆర్ఓఓఫ్ఆర్పట్టాదారులకు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందించే డాటా ఆధారంగా రైతు బీమా కల్పించనున్నారు. ఈ మేరకు కొత్త వారందరూ ఈ నెల 13లోగా క్షేత్రస్థాయిలో ఏఈవోలు, ఏవో వెరిఫికేషన్పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది. అదే విధంగా ఈ నెల 12లోగా పాత లబ్ధిదారులకు సంబంధించిన డేటా రెన్యూవల్పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో అర్హులైన రైతులు, కొత్త రైతుబీమా దరఖాస్తుదారులు ఏఈవోలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఈ యేడు 2025–26 రైతు బీమా కోసం కొత్తగా క్షేత్రస్థాయి అగ్రి కల్చర్ అధికారులకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి రైతు బీమా పోర్టల్ లో అధికారులు అప్లోడ్ చేయనున్నారు. జూన్ 5వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతుల వివరాలను ఏఈవోలు సేకరించి.. వారి వివరాలను రైతు బీమా పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు.
వారిలో బీమాకు అర్హులను ఏఓలు, వ్యవసాయశాఖ అధికారులు గుర్తించే ప్రక్రియ చేపట్టారు. క్షేత్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులు, ఏఈవోలు, ఏఓ, జిల్లాస్థాయిలో అధికారులు అప్లికేషన్లను పరిశీలించి అందులో అర్హులను ఈ నెల 13లోగా గుర్తిస్తారు.
*ఈ నెల 12లోగా రెన్యూవల్స్ పూర్తి*
కొత్త బీమా సంవత్సరంలో ఇప్పటికే రైతు బీమా కలిగిన లబ్ధిదారులైన రైతుల రెన్యూవల్స్ కు సంబధించి డేటా పరిశీలన ఈ నెల 12లోగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. 60 ఏండ్లు నిండిన వారిని తొలగించి.. మిగతా అర్హులైన రైతులకు బీమాను రెన్యూవల్ చేయాలని అధికారులను డైరెక్టర్ గోపీ ఆదేశించారు. ఫీల్డ్ లెవల్లో ఏఈవోలు రైతు బీమా పోర్టల్లో రెన్యూవల్ అప్లోడ్ ప్రక్రియ ఈ నెల 12లోగా పూర్తి చేసుకుని వారికి ఈ నెల 14 నుంచి కొత్త బీమా అమలు చేయనున్నారు.
ఇలా పాత రెన్యూవల్స్ తో పాటు కొత్తగా అర్హులైన వారివి కలిపి ఈ యేడు 48లక్షల మందికి పైగా రైతులకు బీమా అర్హత సాధించే అవకాశాలు ఉన్నట్టు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. రైతు బీమా ఉన్న రైతులు సహజ మరణమైనా, ఏవిధంగా చనిపోయినా సదరు రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందుతుందని వ్యవసాయశాఖ పేర్కొంది. అయితే, భూభారతి లో జూన్ 5వరకు పట్టా పాస్ బుక్ , సీసీఎల్ఏ లో నమోదైన రైతులకు మాత్రమే రైతు బీమా వర్తింపు ఉంటుందని అధికారులు తెలిపారు. సీసీఎల్ఏ లో లేని భూములున్న రైతులకు బీమా వర్తింపు ఉండదని తాజా సర్క్యూలర్లో స్పష్టం చేశారు. ఒకే రైతుకు రెండు అంతకంటే ఎక్కువ గ్రామాల్లో భూమి పట్టా పాస్బుక్ కలిగి ఉన్నప్పటికీ ఒకే పాలసీకి వర్తింపు ఉంటుందని తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది.
*గతంలో దరఖాస్తు చేసుకోని వారికి అవకాశం..*
రైతు బీమా పథకానికి అర్హులై ఉండి.. అప్లై చేసుకోనివారికి సైతం తాజాగా దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అయితే, 5 ఎకరాల లోపు ఉండి కూడా గతంలో అప్లై చేసుకోని రైతులకే ఈ దఫా అవకాశం కల్పిస్తున్నట్టు వ్యవసాయశాఖ తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ యేడు కొత్తగా దరఖా స్తు చేసుకున్న వారు, గతంలో అర్హత ఉండి ఇప్పుడు అప్లై చేసుకున్న వారందరూ కలిపి దాదాపు రెండు లక్షల వరకు ఉండవచ్చిన ప్రాథమిక అంచనాలు ఉన్నాయి…