మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి ఐదు రోజుల జైలు
నిజామాబాద్, నవంబర్ 18:
మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తిని పట్టుకొని ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్టు వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓ రఘుపతి తెలిపారు.
ఈ నెల 15వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో నగరంలోని సాయిరెడ్డి పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు, కోటగల్లీకి చెందిన గుడెపు సంతోష్ అధికంగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అనంతరం అతడిని మంగళవారం స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ముందు హాజరుపరచగా, కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. తదనుగుణంగా అతడిని జైలుకు తరలించినట్లు ఒకటవ టౌన్ ఎస్ఎచ్ఓ రఘుపతి తెలిపారు.
ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మొదటిసారి మద్యం సేవించి డ్రైవ్ చేస్తే ₹10,000 జరిమానా–జైలు శిక్ష, రెండోసారి అయితే ₹15,000 జరిమానా–జైలు శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయని తెలిపారు.ఎవరూ మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.