*తెలంగాణ పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్కకు మాజీ మంత్రి హరీశ్రావు లేఖ రాశారు.*
*రాష్ట్రంలో గ్రామాల స్థితి, పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి దయనీయంగా మారిందని* లేఖలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీలకు ఇచ్చిన నిధులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శుల పనితీరు వల్ల తెలంగాణ గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. *కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిధులు రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు తమ సొంత నిధులు ఖర్చు చేస్తున్నారని, ఆ బిల్లులు రాక ఆందోళనకు గురవుతున్నారని* తెలిపారు. *మాజీ సర్పంచులకు సైతం బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు* తెలిపారు. *స్థానిక సంస్థల నోటిఫికేషన్ వస్తే.. బిల్లులు రావడం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున త్వరగా విడుదల చేయాలని* కోరారు. ఈ మేరకు *ఆరు డిమాండ్లను హరీశ్రావు తన లేఖలో ప్రస్తావించారు.*
గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని, *గతంలో చేసిన పనులకు మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్నారు.* అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం *ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించాలని* డిమాండ్ చేశారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి, పారిశుద్ధ్యం పెంపొందించాలని పేర్కొన్నారు. *గత మూడు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే వారికి వేతనాలు చెల్లించాలన్నారు.* గతేడాది నవంబర్లో నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడం శోచనీయమని, వెంటనే వారి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.