*ఇక నుంచి మీ వెహికిల్ను ఆపరు.. ఆటోమేటిక్గా ఫైన్ పడిపోతుంది.. రాష్ట్రవ్యాప్తంగా AI కెమెరాలు*
రూల్స్ పాటించకుండా.. ఫైన్ కట్టకుండా తప్పించుకు తిరిగే వాహనదారులకు ఇక నుంచి బ్యాడ్ న్యూస్. వాహనాలను ఆపకుండానే ఫైన్ వేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలను (ఏఎన్ పీఆర్) ఏర్పాటు చేస్తున్నారు. ఈ కొత్త టెక్నాలజీతో నిబంధనల ఉల్లంఘంచే వాహనాల్ని వెంటనే పట్టుకునేందుకు రవాణాశాఖ సిద్ధం అవుతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే కెమెరాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం రూ.3.30 కోట్ల ఖర్చుతో 30 ప్రాంతాల్లో 60 ఏఎన్పీఆర్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం పరిపాలనపరమైన అనుమతుల్ని జారీ చేస్తూ రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిధుల విడుదలకు అన్ని రకాల అనుమతులు రానున్నాయి.
వెహికిల్ టాక్స్ కట్టకపోవడం, ఓవర్ లోడింగ్ వంటి నిబంధనలను ఉల్లంఘించే వాహనాల్ని పట్టుకునేందుకు ఈ కెమెరాలు దోహదం చేస్తాయి. ఏఐ సాయంతో వహికిల్ నంబర్ ను ఆటోమేటిక్ గా గుర్తిస్తాయి కెమెరాలు. వెహికిల్ డీటైల్స్ అన్ని అధికారులకు పంపిస్తాయి. దీంతో వేగంగా పట్టుకోవడానికి వీలవుతుంది.
ఇటీవల కామారెడ్డి చెక్పోస్టు వద్ద జూన్ నెలలో ప్రయోగాత్మకంగా కెమెరాలు ఏర్పాటు చేయగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమమేధ) ద్వారా వాహనాల సమాచారం క్షణాల్లో తెలిసిపోయిందని అధికారులు తెలిపారు. ఇదే టెక్నాలజీతో పనిచేసే కెమెరాలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కెమెరాలకు దూరంగా ఉండి అధికారులు కెమెరా పంపే సమాచారంతో.. వెహికిల్ ను ముందుగానే గుర్తించి దూరంగా ఆపుతున్నారు. నిబంధనలను పాటించని వెహికిల్స్ ను కెమెరా సహాయంతో అడ్డుకుని జరిమానాలు విధిస్తున్నారు. ఇలా చేయడం వలన రోడ్లపై కనిపించే ప్రతి వాహనాన్ని ఆపాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు.