**లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఏఈ స్వరూప ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబాటు**
మేడ్చల్ జిల్లా కాప్రా ప్రశ్నా ఆయుధం జూన్ 17
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కాప్రా సర్కిల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఓ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) స్వరూప అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు.
చర్లపల్లి ప్రాంతానికి సంబంధించి ఓ కాంట్రాక్టర్ రామ్ రెడ్డికి సంబంధించిన బిల్లులు క్లియరైనందుకు సంబంధించి రూ. 1.20 లక్షల లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు పథకం ప్రకారం వల పన్ని ఆమెను పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే, బిల్లుల చెల్లింపుల కోసం ఏఈ స్వరూప లంచం డిమాండ్ చేయడంతో బాధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. తదనుగుణంగా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని, కాప్రా మున్సిపల్ కార్యాలయం గేటు దాటే సమయంలో స్వరూపను అదుపులోకి తీసుకుని, ఆమె వద్ద నుంచి రూ. 1.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గతంలోనూ స్వరూపపై లంచం కేసుల నేపథ్యంలో పలు ఆరోపణలు నమోదై ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఘటనపై ఇంకా లోతుగా విచారణ చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
ఈ ఘటన జీహెచ్ఎంసీలో అవినీతి వ్యవహారాలపై మరోసారి దృష్టి ఆకర్షించగా, పాలకులు, అధికారులు దీనిపై తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండు ప్రజల నుంచి వినిపిస్తోంది.