Site icon PRASHNA AYUDHAM

యాచక రహిత నగరానికి జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్

IMG 20250626 154155

*యాచక రహిత నగరానికి జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్*

హైదరాబాద్, జూన్ 26:: గ్రేటర్ హైదరాబాద్ లో పలు ప్రధాన కూడళ్ళలో ఇబ్బందులు కలిగిస్తున్న యాచకులను గుర్తించి షెల్టర్ హోమ్ లకు లేదా సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. జీహెచ్ఎంసీ కమీషనర్ ఆదేశాలమేరకు ఇప్పటికే, జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ప్రధానంగా, బషీర్ బాగ్, సెక్రెటరియేట్, నాంపల్లి, బేగంబజార్ తదితర ప్రాంతాల్లో జంక్షన్ల వద్ద ఉండే యాచకులు, ఫుట్ పాత్ లపై ఉండే వారిని గుర్తించి జీహెచ్ఎంసీ నిర్వహించే షెల్టర్ హోమ్ లకు తరలిస్తున్నారు. మిగిలిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని తమ స్వంత ఊర్లకు, నివాసాలకు పంపిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని, జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ విభాగం ఆధ్వర్యంలో గత రెండు, మూడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్లు, మతపరమైన ప్రదేశాలలో భిక్షాటన చేసే వారి గురించి సమాచారం అందుకొని, వారిని, వైద్య పరీక్షల తర్వాత పోలీసుల సహకారంతో జీహెచ్ఎంసీ షెల్టర్ హోమ్స్‌కు తరలించే ఏర్పాటు చేస్తున్నారు.

ఈ కొద్దీ రోజులుగా యు.సి.డీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాచకుల తరలింపులో 221 మందిని గుర్తించారు. వీరిలో 173 మంది పురుషులు, 37 మంది స్త్రీలు, 11 పిల్లలున్నారని గుర్తించారు. వీరిలో 19 మందిని జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్ కు తరలించగా, మిగిలిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారి వారి కుటుంబ సభ్యుల వద్దకు పంపించారు. యాచకులు, ఫుట్ పాత్ లపై ఉండేవారిని షెల్టర్ హోమ్ లకు లేదా వారి కుటుంబ సభ్యుల వద్దకు తరలించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఇందుకై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ యు.సి.డీ అధికారులు తెలిపారు.

Exit mobile version