రాజ్యసభకు వెళ్తున్నారా?’ క్లారిటీ ఇచ్చేసిన కేజ్రీవాల్‌.. అసెంబ్లీ ఉపపోరులో గెలుపుపై హర్షం..!!

*_’రాజ్యసభకు వెళ్తున్నారా?’ క్లారిటీ ఇచ్చేసిన కేజ్రీవాల్‌.. అసెంబ్లీ ఉపపోరులో గెలుపుపై హర్షం..!!_*

డిల్లీ: రాజ్యసభకు ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) స్పందించారు.

తాను రాజ్యసభకు వెళ్లడంలేదని స్పష్టం చేశారు. పంజాబ్‌లోని లుథియానా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజీవ్‌ అరోడా విజయం సాధించారు. దీంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే.. ఖాళీ అయ్యే ఈ స్థానం నుంచి కేజ్రీవాల్‌ పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారంటూ విపక్షాలు పలు వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చాయి. అయితే, తాను రాజ్యసభకు వెళ్లట్లేదని క్లారిటీ ఇచ్చిన కేజ్రీవాల్‌.. ఖాళీ అయ్యే రాజ్యసభ సీటు నుంచి ఎవరు పోటీ చేయాలనేది ఆప్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

*_గుజరాత్ ప్రజల చూపు మావైపే.._*

మరోవైపు, గుజరాత్‌లోని విశావదర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించడంపై కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్‌ ప్రజలు భాజపాతో విసిగివేసారిపోయారని, ఇప్పుడు వారంతా ఆప్‌వైపే చూస్తున్నారన్నారు. గుజరాత్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. విశావదర్‌లో ఆప్‌ అభ్యర్థి విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆప్‌ని ఓడించేందుకు భాజపా, కాంగ్రెస్‌ పంజాబ్‌, గుజరాత్‌ ఎన్నికల్లో పోటీ చేస్తే.. ప్రజలు వారిని తిరస్కరించారన్నారు. పంజాబ్‌లోని లుథియానా పశ్చిమ స్థానంలోనూ ఆప్‌ను గెలిపించడం ద్వారా పంజాబ్ ప్రజలు తమ ప్రభుత్వ పనితీరుకు ఆమోదం తెలిపారన్నారు. గుజరాత్‌లో భాజపా, ఆప్‌ మధ్యే ప్రత్యక్ష పోటీ ఉందన్న ఆయన.. భాజపాకు కాంగ్రెస్‌ కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు.

*_ఉప పోరులో పట్టునిలుపుకొన్న ఆప్‌.. కేరళలో ఎల్డీఎఫ్‌కు షాక్‌!_*

దేశ వ్యాప్తంగా జూన్‌ 19న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఉప ఎన్నికల్లో గుజరాత్‌లో ఆప్‌ ఒక స్థానాన్ని కైవసం చేసుకొని సత్తా చాటింది. విశావదర్‌ సీటు నుంచి భాజపా అభ్యర్థి కిరీట్‌ పటేల్‌పై ఆప్‌ నేత గోపాల్‌ ఇటాలియా 17వేల పైచిలుకు ఓట్లతేడాతో విజయం సాధించారు. గుజరాత్‌లో భాజపాకు పూర్తి ఆధిపత్యం ఉన్నప్పటికీ.. 2007 నుంచి విశావదర్‌ స్థానాన్ని గెలుచుకోలేకపోతోంది. అయితే, గత ఎన్నికల్లో ఈ సీటులో ఆప్‌ కైవసం చేసుకున్నప్పటికీ.. ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ రాజీనామా చేసి భాజపాలో చేరారు. దీంతో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ ఆప్‌ విజయం సాధించింది. అలాగే, గుజరాత్‌లో కాడి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి రాజేంద్ర చావ్డా విజయం సాధించారు. కాగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ చావ్డాపై జయకేతనం ఎగురవేశారు.

పంజాబ్‌లోని లుథియానా వెస్ట్‌ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఆప్‌ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్‌ అభ్యర్థి భరత్‌ భూషణ్‌ ఆషుపై ఆప్‌ అభ్యర్థి, రాజ్యసభ ఎంపీ సంజీవ్‌ అరోడా 10,637 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ ఆప్‌ అభ్యర్థి అరోడాకు 35,179 రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆషుకు 24,542 ఓట్లు, భాజపా అభ్యర్థి జివాన్‌ గుప్తాకు 20,323 ఓట్లు; అకాలీదళ్‌ అభ్యర్థికి కేవలం 8,203 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ ఆప్‌ ఎమ్మెల్యే గురుప్రీత్‌ బస్సీ గోగి మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

కేరళలో నిలంబర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్‌కు షాక్ తగిలింది. ఈ సీటులో కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ అభ్యర్థి ఆర్యదాన్‌ షౌకత్‌ సీపీఎం అభ్యర్థిపై 11,077 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. షౌకత్‌ ప్రముఖ కాంగ్రెస్‌ నేత ఆర్యదాన్‌ ముహమ్మద్‌ తనయుడు. గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన పీవీ అన్వర్‌ రాజీనామాతో ఈ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది.

మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లోని కాలీగంజ్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించింది. టీఎంసీ అభ్యర్థి అలీఫా అఇ్మద్‌కు 32,308 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థికి కేవలం 13,144 ఓట్లు మాత్రమే వచ్చాయి. భాజపా అభ్యర్థి 11,987 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. టీఎంసీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నసీరుద్దీన్‌ అహ్మద్‌ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కాగా.. ఆయన కుమార్తె అలిఫా అహ్మద్‌ను దీదీ బరిలో నిలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment