*ప్రభుత్వ భూములు స్వచ్ఛందంగా అప్పగించాలి*
*కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగింత*
సిరిసిల్ల, జనవరి15,
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో ప్రభుత్వ భూమి అప్పగింత పై ఎస్పీ అఖిల్ మహజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ* తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన కూనవేణి నర్సయ్య గ్రామ సర్వే నెంబర్ 464/4లో గల 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని సాగు చేసుకుంటున్నాడని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన బుస్స లింగం గ్రామ సర్వే నెంబర్ 365/అ/2లో ఎకరం ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ వివరించారు.జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే సదురు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని, ఈ భూములను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని, పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. 2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతు బంధు, పీఎం కిసాన్ మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ది పొందినందుకు ఆ సొమ్ము రికవరి కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.