తెలంగాణలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు, యువతను ఆకర్షించే పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. సమన్వయ కమిటీ, పని విభజన, ఓటర్ల నమోదు ప్రక్రియ వెంటనే చేపట్టాలని స్పష్టం చేశారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు జూమ్ సమావేశం నిర్వహించారు. నిజామాబాద్, మెదక్, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శలు పాల్గొన్నారు. ఈ నెల 15 కల్లా ఎన్నికలకు సంబంధించి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి అభ్యర్థి ఎంపిక కోసం సీనియర్ నాయకులతో అభిప్రాయాలను సేకరించాలని దిశానిర్దేశం చేశారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థి ఎంపిక ఉండాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.