*రాష్ట్రంలో 50 శాతానికి మించి రుణమాఫీ కాలేదు*
*హైడ్రా పేరిట డ్రామాలు*
మెదక్/నర్సాపూర్, సెప్టెంబరు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): యూట్యూబ్ లు చూస్తే రేవంత్ రెడ్డికి వెన్నుల్లో వణుకు పుడుతోందని, రేవంత్ ఫార్మసీటీ, మెట్రో రైలు విషయంలో రూటు మార్చారని, హైదరాబాద్ బ్రాండు ఇమేజ్ ను రేవంత్ రెడ్డి ఖతం చేశారని, రియల్ ఎస్టేట్ కూడా పడిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం సాయంత్రం మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏ గ్రామానికి వెళ్లినా రుణమాఫీ కాలేదని చెబుతున్నారని, రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ నాయకులను రైతులు రూముల్లో వేసి బందిస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి తొందర పాటు వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో 50 శాతానికి మించి రుణమాఫీ కాలేదని, 41 లక్షల మందికి రుణమాఫీ అవ్వాల్సి ఉంటే.. 20లక్షల మందికి మాత్రమే చేశారని, ఇంకా 21 లక్షల మందికి రుణమాఫీ కాలేదని అన్నారు. రైతుబంధు ఎగ్గొట్టేశారని, రైతుబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, రెండుసార్లు రుణమాఫీ చేసిందని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అంటివి, ఇప్పుడేమో సన్నవడ్లకు బోనస్ అంటివి.. బోనస్ ని బోగస్ చేశారని పేర్కొన్నారు. 10 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీకి నిధులు విడుదల అవ్వట్లేదని, సర్పంచులను కదిలిస్తే కన్నీళ్లు బయటకు వస్తున్నాయని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రతి నెల పల్లె ప్రగతికి నిధులు వచ్చాయని, ఇప్పుడు నిధులు కరువయ్యాయని హరీష్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టణాలను, గ్రామాలను గాలికి వదిలేసిందని, హైడ్రా పేరిట డ్రామాలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీపై ఇచ్చిన 800 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్ళించిందని హరీష్ రావు పేర్కొన్నారు. రైతులకు 100 శాతం రుణమాఫీ అయ్యేదాకా, పంట బీమా, భరోసా కల్పించకపోతే రానున్న కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆందోళనలు చేపడుతుందని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దొంతి చంద్రాగౌడ్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నయీముద్దీన్, బీఆర్ఎస్ నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, భోగ శేఖర్, హరికృష్ణ, పంబాల బిక్షపతి, మన్సూర్, సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.