పదేళ్లుగా మంత్రిగా పనిచేసిన… సిద్దిపేటలో చీమకు కూడా హానీ తలపెట్టలేదు. శుక్ర వారం అర్ధరాత్రి జరిగిన సంఘటన ఏనాడైనా జరిగిందా? అరాచకానికి పాల్పడుతున్నారు ఇది మంచిదా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అడిగారు. పట్టణ మేధావులు ఆలోచన చేయాలన్నారు. రెండు రోజులపాటు సిద్దిపేటలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై పై విధంగా స్పందించారు. శనివారం రాత్రి సిద్దిపేట టౌన్ ఎన్జీఓ భవన్లో టెన్త్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు, తల్లిదండ్రుల సన్మానంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట కీర్తి పెంచేలా పనిచేశామన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో ఆ కీర్తి మసక బారేలా చేస్తున్న విషయాన్ని మేధావులు గుర్తిం చాలన్నారు. తాను ఎప్పుడూ అరాచకాలను ప్రోత్సాహించలేదన్నారు. భవిష్యత్లో కూడా చేయబోనని స్పష్టం చేశారు.రుణమాఫీ సవాళ్లు పర్వం శనివారం సిద్దిపేటలో ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలో 12 గంటల పాటు టెన్షన్ వాతావరణం నెలకొంది. హరీశ్రావు రాజీనామా చేయాలని శుక్రవారం అర్ధరాత్రి ఫ్లెక్సీలు వెలిశాయి. వీటిని బీఆర్ఎస్ నేతలు తొలగిస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఎక్కి హరీశ్రావు ఫ్లెక్సీని చించివేశారు. దానికి నిరసనగా శనివారం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సాయిరాం, వేణుగోపాల్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో పాత బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కాగా ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మళ్లీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీదకు కాంగ్రెస్ నాయకులు దాడికి వస్తున్నారని పుకార్లు రావడంతో పెద్ద ఎత్తున అక్కడికి బీఆర్ఎస్ నాయకులు బయలుదేరారు. ఆ మేరకు పోలీసు కమిషనర్ నుంచి ఆదేశాల రావడంతో పోలీసు బలగాలను మోహరించారు.