సిద్దిపేట, గజ్వేల్, మార్చి 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): చదువుతోనే కురుమల జీవితాల్లో వెలుగులు నిండుతాయని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కురుమ రిజర్వేషన్ పోరాట సమితి కొండ పోచమ్మ దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చదవాలి.. ప్రతి ఒక్కరు ఎదగాలని, చదివే అందరికీ లక్ష్యంగా మారాలని అన్నారు. కష్ట జీవులుగా ఉన్న మనం కష్టమైనా చదువును వదలొద్దని అదే మనల్ని సరైన లక్ష్యానికి చేరవేస్తుందన్నారు. అందుకు కొమరవెల్లి మల్లికార్జునస్వామి దర్శించుకున్న ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి శాలువాతో సన్మానం చేశారు. అనంతరం కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తన పూర్వికుల నుండి కొండపోచమ్మ అమ్మవారిని ఇంటిదేవునిగా పిలుస్తున్నామని, గతంలో తెలంగాణ కొరకు ఇక్కడ మొక్కుకున్న మొక్కులను ఆయన గుర్తు చేశారు. కొండపోచమ్మ అమ్మవారి వద్ద టీటీడీ బోర్డు ద్వారా ఫంక్షన్ హాలు గెస్ట్ హౌస్ మంజూరు చేయించాలని స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు మాట్లాడుతూ.. కురుమలకు కేంద్ర ప్రభుత్వం సహాయంతో గొంగడి పరిశ్రమలు మిషన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొండ పోచమ్మ అమ్మవారి ఫంక్షన్ హాల్ ఏర్పాటుకు తన ఎంపీ నిధులతో ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయ అభివృద్ధిలో తాను ముందుండి పని చేస్తామన్నారు. ఉన్నితో తయారు చేసే వస్త్రాలను కేంద్ర బలగాలకు హాస్పటల్ కు రైల్వేలకు ఇచ్చే వస్త్రాలను గొంగళ్ళ పరిశ్రమలు ఏర్పాటు చేసి వారికి ఉపాధి చూపించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు మాట్లాడుతూ.. కొండపోచమ్మ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అని, ఇక్కడ కోరిన కోర్కెలు తీర్చే ఇంటి ఇలవేల్పుగా లక్షలాది మంది భక్తి ప్రపత్తులతో దర్శించుకునే తెలంగాణలో అతి ముఖ్యమైన దేవాలయం కొండ పోచమ్మ అని అన్నారు. టీటీడీ ద్వారా ఫంక్షన్ హాల్స్ దేవాలయ అభివృద్ధి కొరకు ఎంపీ నిధులు కేంద్ర నిధులు తో దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వకుండా అమ్మవారిని మోసం చేశారన్నారు. కెసిఆర్ మనసుల్ని కాదు దేవుళ్లను మోసం చేసిన వారిలో నిలిచిపోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, కురుమ సంఘం నాయకులు పెద్దపురం నరసింహ, మాజీ సర్పంచ్ రమేష్, పులి బాలచంద్రం, కుల బీరయ్య, సిద్దల రవి, సంఘపు అనిల్, కామల్ల భూమయ్య, రాజు, బింగి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.