రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం 482 మంది వైద్యులకు శాశ్వత ప్రాతిపదికన నియామక ఉత్తర్వులు జారీచేసినట్లు వెల్లడించారు. ప్రజారోగ్య శాఖ ద్వారా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉత్తర్వులు పొందినవారు 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని సూచించారు.
గత ఏడాది 636 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా, 5వేల దరఖాస్తులు వచ్చాయి. ఎంపికైన వారి జాబితాను మార్చి 11న నియామక బోర్డు ప్రకటించింది. స్పోర్ట్స్ కేటగిరి మినహాయించి 611 పోస్టులకు గాను 482 మంది అభ్యర్థులు స్పందించారు. వీరితో సహా మొత్తం 482 మందికి ఆన్లైన్ ద్వారా పోస్టింగ్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నియామక కౌన్సెలింగ్ ప్రక్రియ, పోస్టింగ్ ఉత్తర్వులు జారీ పూర్తిగా ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా జరిగినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం కాగిత రహితంగా పూర్తయింది. గతంలో జూమ్ కాన్ఫరెన్స్ విధానంలో పోస్టుల కేటాయింపు జరిగేది, ఈసారి ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకత పెంచారు.
ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ, ఆసుపత్రుల వారీగా ప్రకటించిన పోస్టులకు ప్రాధాన్య క్రమంలో అభ్యర్థులు ఆప్షన్లు ఇచ్చారని, దాని ప్రకారం ఆన్లైన్ ద్వారానే పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. పోస్టింగ్లు పొందిన 482 మందిలో కొన్ని ట్యూటర్ల పోస్టులు కూడా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రంలో కడప జిల్లాలో అత్యధికంగా 52 మందికి, అనంతపురం-34, శ్రీకాకుళం-31, కాకినాడ-29, కర్నూలు-27, పల్నాడు-26, ఎన్టీఆర్-23, నంద్యాల-19, కృష్ణా-19, ప్రకాశం-17, ఏలూరు-17, విజయనగరం-16, పశ్చిమగోదావరి-15, గుంటూరు-14, పార్వతీపురం మన్యం-14, అంబేద్కర్ కోనసీమ-13, అల్లూరి సీతారామరాజు-13, ఈస్ట్ గోదావరి-12, వైజాగ్-12, చిత్తూరు-12, మార్కాపురం-11, సత్యసాయి-11, అన్నమయ్య-10, నెల్లూరు జిల్లాలో పది చొప్పున పోస్టుల భర్తీ ఉత్తర్వులు జారీ అయినట్లు డాక్టర్ పద్మావతి చెప్పారు. స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరిలో ఉన్న 19 పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. 2024 డిసెంబరులో జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా 392 మంది వైద్యాధికారులు ఇప్పటికే పోస్టింగులు పొందారు.











