వడదెబ్బతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ నిరాకరించడంతో, కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన హృదయ విదారక ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది.
భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన కండె వెంకన్న (42) వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, మరణించిన వారిని ప్రభుత్వ అంబులెన్స్లో ఇంటికి తరలించాలి.
అయితే, వెంకన్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ కోసం ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించగా, వారికి సరైన స్పందన లభించలేదని తెలుస్తోంది. ప్రైవేట్ వాహనాన్ని మాట్లాడుకునే స్తోమత లేకపోవడంతో, కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనతో మృతదేహాన్ని భుజాలపైనే మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు.
ఈ సంఘటన ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ సేవలు, మౌలిక సదుపాయాల కల్పనలో ఉన్న లోపాలను బహిర్గతం చేసింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక కుటుంబం పడిన బాధలు విస్మయం కలిగించాయి.
ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.










