*భారీ ఎన్కౌంటర్.. కీలక మావో నేతలు హతం*
*మావోయిస్టులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది*
*తెలంగాణ – బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో కీలక మావోయిస్టుల నేతలు హతమయ్యారు*
*Operation Karreguttalu: భారీ ఎన్కౌంటర్.. కీలక మావో నేతలు హతం*
*ఛత్తీస్గఢ్ మే 08*
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కర్రెగుట్టలు (Operation Karreguttalu) మరింత దూకుడుగా కొనసాగుతోంది. తెలంగాణ – బీజాపూర్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో కీలక మావోయిస్టుల నేతలు హతమయ్యారు. బీజాపూర్ జిల్లా ఉసూరు బ్లాక్ లంకపల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, ఎస్.జెడ్.సీ.మెంబర్ బండీ ప్రకాశ్ సహా 8 మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. అయితే ఎన్ కౌంటర్ మృతులపై పోలీసు అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
కాగా.. ఛత్తీస్గఢ్ – తెలంగాణ సరిహద్దు బీజాపూర్ జిల్లాలో ఈరోజు (గురువారం) ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న కూంబింగ్కు వెళ్లిన భద్రతా బలగాలకు పది మందితో కూడిన మావోయిస్టులు తారసబడ్డట్టు తెలుస్తోంది. వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఈ ఎన్కౌంటర్పై పౌరహక్కుల సంఘాలు కూడా ఆరా తీస్తున్నాయి. చంద్రన్న చాలా కీలకమైన నేత. తెలంగాణకు సంబంధించి నాయకత్వంలో చంద్రన్న, రాష్ట్ర కార్యదర్శి దామోదర్ కీలక భూమిక పోషిస్తున్నారు. కర్రెగుట్టల్లో ఉన్న గుహలు చంద్రన్న ఆధ్వర్యంలోనే ఆపరేషన్ అంతా కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రన్న కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్లు సమాచారం. కానీ భద్రతా బలగాలు, పోలీసులు దీనికి ఇంకా ధృవీకరించడం లేదు.
అయితే ఆపరేషన్ కగార్కు తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదని ఈ మధ్యకాలంలో తెలంగాణ నేతలు, మంత్రి సీతక్కతో పాటు ఓ మీడియా చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ తెలంగాణ పోలీసులకు తెలిసి జరిగిందా లేదంటే కేంద్ర భద్రతా బలగాల ఆధ్వర్యంలో జరిగిందా అనే తెలియాల్సి ఉంది.