*రెచ్చిపోయిన మహిళ.. ఆ వ్యక్తి గుండెపై గన్నుపెట్టి..*
జనాల్లో నేర ప్రవృత్తి బాగా పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. అవతలి వాళ్లను గాయపర్చడానికి.. చంపడానికి కూడా వెనుకాడడం లేదు.
మగాళ్లే అనుకుంటే.. ఆడవాళ్లూ క్రూరంగా తయారు అవుతున్నారు. తాజాగా, ఓ మహిళ పెట్రోల్ బంక్ సిబ్బందిపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయింది. వారితో జరిగిన గొడవ సందర్భంగా గన్నుతో బెదిరింపులకు దిగింది. ఏకంగా పెట్రోల్ బంక్ సిబ్బంది గుండెపై గన్ను పెట్టి వార్నింగ్ ఇచ్చింది.
ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్కి చెందిన ఓ ఫ్యామిలీ స్థానికంగా ఉండే పెట్రోల్ బంకు దగ్గరకు కారులో వెళ్లింది. ఆ కారు గ్యాస్తో నడిచేది అవ్వటంతో.. పెట్రోల్ సిబ్బందిని పిలిచి గ్యాస్ నింపమన్నారు. రజినీష్ కుమార్ వారి దగ్గరకు వచ్చాడు. కారులో ఉన్న వారందరి భద్రతను దృష్టిలో పెట్టుకుని.. కిందకు దిగమని ఎంతో మర్యాదగా చెప్పాడు. కారులో ఉన్న ఎహసాన్ ఖాన్ కిందకు దిగాడు.
రజినీష్ కుమార్తో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ చిలికి చిలికి గాలి వానలా తయారయ్యింది. ఈ నేపథ్యంలోనే రజినీష్ కుమార్.. ఎహసాన్ను కుడి మోచేత్తో తోసేశాడు. దీంతో ఎహసాన్ కూతురు ఆరీబా కోపం కట్టలు తెంచుకుంది. కోపంతో రజినీష్ను ముందుకు తోసేసింది. ఆ వెంటనే కారు దగ్గరకు పరిగెత్తింది. అక్కడే ఉన్న జనం గొడవను ఆపడానికి ప్రయత్నించసాగారు. కొద్దిసేపటి తర్వాత ఆరీబా గన్నుతో అక్కడికి వచ్చింది. నేరుగా రజినీష్ దగ్గరకు వెళ్లింది. గన్ను తీసి అతడి గుండె మీద పెట్టింది.
‘నేను కాలిస్తే.. మీ ఇంట్లో వాళ్లు కూడా నిన్ను గుర్తుపట్టలేరు’ అని అంది. ఆ వ్యక్తి ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆరీబా తల్లి కలుగజేసుకుంది. కూతుర్ని పక్కకు లాగింది. ఈ కథ ఇంతటితో ముగియలేదు. రజినీష్ ఆరీబా కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎహసాన్ పేరు మీద ఉన్న గన్నును సీజ్ చేశారు.