Headlines :
-
ఉబర్-ఐఏఎఫ్ ఒప్పందంపై భద్రతా నిపుణుల ఆందోళన
-
భారత వైమానిక దళం, ఉబర్ ఒప్పందాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్
-
అధికారుల రవాణా సేవలకు ఉబర్ ఎంపికపై వివాదం
-
జియో-ట్యాగింగ్ కారణంగా వైమానిక దళ భద్రతపై నిపుణుల సందేహాలు
ఐఏఎఫ్, ఉబర్ అగ్రిమెంట్పై భద్రతా నిపుణుల ఆందోళనపున:పరిశీలించాలని డిమాండ్
భారత వైమానిక దళం (ఐఏఎఫ్), అమెరికాకు చెందిన యాప్ ఆధారిత క్యాబ్ సేవల సంస్థ ఉబర్ మధ్య కుదిరిన ఒప్పందంపై భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. క్యాబ్ సేవల కోసం ఉబర్తో భారత వైమానిక దళం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం వైమానిక దళానికి చెందిన అధికారులు, వారి కుటుంబాలకు ఉబర్ సంస్థ ఎలాంటి ఆటంకాలు లేకుండా సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే ఈ ఒప్పందంపై భద్రతా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం బయటికి పొక్కే అవకాశం ఉన్నదని, అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నదీ తేలికగా కనిపెట్టవచ్చునని, వేరే యాప్లు కీలక సమాచారాన్ని పొంది దానిని ఇతరులకు అందజేసే ప్రమాదం ఉన్నదని వారు అనుమానాలు వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో ఉబర్తో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై పున్ణపరిశీలన జరపాలంటూ రిటైర్డ్ సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ కేజీఎస్ థిల్లాన్ వైమానిక దళ నాయకత్వానికి సూచించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు.’ఈ ఒప్పందాన్ని పున్ణపరిశీలించే విషయంపై తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వైమానిక దళంలో పనిచేసే ప్రతి వారినీ మీరు జియో-ట్యాగింగ్ చేస్తున్నారు. కాబట్టి వారి కదలికలను తేలికగా తెలుసుకోవచ్చు’ అని ఛినార్ కోర్ మాజీ కమాండర్ అయిన థిల్లాన్ ఆ పోస్టులో వివరించారు. మరో రిటైర్డ్ సైనికాధికారి అయిన పవిత్రన్ రాజన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమాచారాన్ని స్థానికీకరించని పక్షంలో ఇండిజినస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), పటిష్టమైన సమాచార గోప్యతా చట్టాలు అసాధ్యమని ఆయన తెలిపారు.
‘ఎత్తుగడ లేని వ్యూహం విజయాన్ని తేలికగా అందించదు. వ్యూహం లేని ఎత్తుగడ ఓటమి ముందు శబ్దం వంటిది. సైనిక దళాల అధిపతిని బహిరంగంగా చులకన చేయడం, తక్కువ చేయడం నాకు సంతోషాన్ని కలిగించదు. దేశాన్ని రక్షించేందుకు సార్వభౌమత్వ సైబర్స్పేస్, అవసరమైన చట్టాలు లేకుండా భారత్కు సంబంధించిన పురుగుల డబ్బాను తెరవడంపై మనం చర్చించాల్సిన అవసరం ఉంది’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దీనర్థం తగిన రక్షణ చర్యలు తీసుకోకుండా తేనెతుట్టెను కదల్చడమే. సమాచార స్థానికీకరణ, దేశీయ ఐసీటీ లేకుండా బలమైన గోప్యతా చట్టాలు చేయడం అసాధ్యమని, భారత సైనిక రక్షణ వ్యవస్థకు ఇది మేలుకొలుపు వంటిదని రాజన్ తెలిపారు.
భారత వైమానిక దళం గత నెల 18న ఉబర్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వైమానిక దళ సిబ్బంది, సీనియర్ అధికారులు, వారి కుటుంబాలకు నమ్మకమైన, సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు ఈ ఒప్పందాన్ని ఉద్దేశించారు. దీనిపై ఎయిర్ వైస్ మార్షల్ ఉపదేశ్ శర్మ, ఊబర్ సీనియర్ అధికారి సంతకాలు చేశారని వైమానిక దళం ఎక్స్లో తెలిపింది. అయితే సామాజిక మాధ్యమాలలో విమర్శలు వెల్లువెత్తడంతో దానిని తొలగించింది.