ఫోన్ ట్యాపింగ్ : నెంబర్లు బయటకు వస్తే రచ్చే!
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రలోనూ ప్రకంపనలు రేపుతోంది. షర్మిల తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆధారాలు ఇస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి దగ్గర ట్యాపింగ్ అయిన ఆడియో ఉందని కూడా అంటున్నారు. అంటే ఎంత విచ్చలవిడిగా ట్యాపింగ్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రాథమిక సమాచారం ప్రకారం మావోయిస్టు సానుభూతిపరుల పేరుతో వందల మంది నాయకుల పేర్లను ట్యాపింగ్ జాబితాలో చేర్చారు. వారి కదలికల్ని ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు నెంబర్లను ఆ జాబితాలో చేర్చి.. తమ పనులు పూర్తి చేసుకున్నారు. వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు.
ప్రభుత్వం ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేసిందన్నది ఇంకా అధికారిక సమాచారం లేదు. కానీ అనధికారికంగా మాత్రం చాలా మందికి క్లారిటీ ఉంది. ఇప్పుడు అధికారికంగా బయటకు రావాల్సి ఉంది. మావోయిస్టు సానుభూతిపరుల పేరుతో రివ్యూ కమిటీ నుంచి ట్యాపింగ్ కు అనుమతి తీుకున్న ఫోన్ నెంబర్ల వివరాలు బయటకు వస్తే.. రచ్చ జరగడం ఖాయం అని అనుకోవచ్చు. ఎందుకంటే నిఘా పెట్టింది కేవలం రాజకీయ ప్రత్యర్థులపైనే కాదు.. సొంత నేతలపై కూడా. ఏపీలో వైసీపీకి చెందిన కాసు మహేష్ రెడ్డితో పాటు మరికొంత మందిపైనా నిఘా పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది.
అప్పటి విపక్ష నేతలపైనే కాదు.. సొంత వారిపైనా !
బీఆర్ఎస్ లో ముఖ్య నేతలందరిపైనా నిఘా ఉన్నట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబంలోని కొంత మందిపైనా ట్యాపింగ్ అస్త్రం ప్రయోగించినట్లుగా చెబుతున్నారు. అంటే ఎవర్నీ నమ్మలేదు. అధికారికంగా తమ ఫోన్లను ట్యాప్ చేయించారని తెలిసిన తర్వాత ఎవరూ సైలెంటుగా ఉండే అవకాశం లేదు. అందరూ తీవ్రంగా స్పందిస్తారు. వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించిన వారిపై విరుచుకుపడుతారు. అది కుటుంబసభ్యుడు అయినా సరే ఆగరు.
ట్యాపింగ్ చేయించి సర్వనాశనం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వైసీపీ, బీఆర్ఎస్ కలసి కట్టుగా పని చేశారన్నది అందరూ నమ్ముతున్న విషయం . ఇంకా చెప్పాలంటే అధినేతలు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిన విషయం. ఇక్కడ ఎంత మంది ఫోన్లు ట్యాప్ చేశారు.. ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారన్నది బయటకు వస్తే.. అసలు రాజకీయ సునామీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారు రాజకీయ భవిష్యత్ నే కాదు.. కుటుంబాన్ని నాశనం చేసుకున్నట్లుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి.