సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆయిల్ పామ్ సాగు ఒక కల్పవృక్షం లాంటిదని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. ఐదేళ్లు శ్రద్ధగా ఆయిల్ ఫామ్ మొక్కలను పెంచితే జీవితాంతం రైతులకు నిరంతర ఆదాయం వచ్చే పంట ఆయిల్ ఫామ్ పంట అని అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో గోద్రెజ్ ఆగ్రోవెట్ ఆధ్వర్యంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖలు సంయుక్తంగా జిల్లాలోని సహకార సంఘాల సీఈవోలు, రైతులకు ఆయిల్ ఫామ్ పంట సాగు పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నూనె గింజల పంటల సాగులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని అన్నారు. ఒకసారి ఆయిల్ ఫామ్ పంట దిగుబడి రావడం ప్రారంభమైతే 25–30 సంవత్సరాలపాటు వరుసగా ఆదాయం వస్తుందని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ ఫాం సాగును చేపట్టవచ్చని అన్నారు. జిల్లాలో ఈ ఏడాది 3750 ఎకరాలు ప్రభుత్వం టార్గెట్ గా నిర్ణయించగా ఇప్పటికి వరకు 1400 ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంట సాగు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో వరి పంట కోతలు ప్రారంభమయ్యాయని, జిల్లాలోని అత్యధిక సంఖ్యలో రైతులు సహకార సంఘాల సిబ్బందితో అభి నవభావ సంబంధాన్ని ఏర్పరచుకున్నారని ఎరువులు విత్తనాల కొనుగోలు నుండి పంట పండిన పంటలు అమ్ముకునే వరకు ప్రతి విషయంలో ప్రతిరోజు రైతులు సహకార సంఘానికి వస్తుంటారని అలాంటి రైతులకు సహకార సంఘాల సీఈవోలు ఆయిల్ ఫామ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించి అత్యధిక విస్తీర్ణంలో తమ పరిధిలో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సందర్భంగా కలెక్టర్ సహకార సంఘాల సీఈఓలకు సూచించారు. జిల్లాలోని రైతులు ఉన్నత లాభాలు ఇచ్చే నాణ్యమైన పంటలను సాగు చేసేలా సహకార సంఘాల సీఈవోలు ఉద్యానవన శాఖ వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఇతర నూనె గింజల పంటలతో పోలిస్తే ఆయిల్ ఫామ్ 4–5 రెట్లు ఎక్కువ నూనె గింజలను ఉత్పత్తి చేస్తుందని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు వల్ల మార్కెట్ భయం లేదని, కంపెనీలే తోట వద్దకు వచ్చి ఆయిల్ ఫామ్ గెలలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. తక్కువ నీటితో డ్రిప్ పద్ధతిలో ఆయిల్ ఫామ్ సాగు వల్ల సాగు నీటిని ఆదా చేయవచ్చని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు దీర్ఘకాలంలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు మెట్టు భూముల్లో కూడా అనుకూలం అని, జిల్లాలో మంజీరా పరివాహక ప్రాంతాల్లో ఆయిల్ పామ్ విస్తరణకు మంచి అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి సిహెచ్ పండరి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, డిసిఓ కిరణ్ కుమార్, ఉద్యానవన అధికారులు, గోద్రేజ్ ఆగ్రోవెట్ జనరల్ మేనేజర్ స్వీటీ వేగుంట, పీఏసీఎస్ చైర్మన్లు, అధ్యక్షులు, సహకార సంఘాల సెక్రటరీలు కార్యదర్శులు, రైతులు ఉద్యాన శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగు కోసం ఐదేళ్లు కష్టపడితే జీవితాంతం లాభాలు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Published On: October 29, 2025 4:41 pm