Site icon PRASHNA AYUDHAM

ఇంద్రేశంలో అక్రమ నిర్మాణాలపై ఆదేశాలు జారీ అయ్యాయ్… చర్యలు మాత్రం గల్లంతయ్యాయ్..!

IMG 20250620 WA2114

*ఇంద్రేశంలో అక్రమ నిర్మాణాలపై ఆదేశాలు జారీ అయ్యాయ్… చర్యలు మాత్రం గల్లంతయ్యాయ్..!*

*డీపీఓ ఆదేశాలిచ్చినా… పంచాయతీ కార్యదర్శి పట్టించుకోలేదా..?*

*పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరిగితే.. 9 మాత్రమే గుర్తింపు*

*డీపీఓ ఆదేశాలు ఇచ్చి వారం అవుతున్నా.. ఎలాంటి చర్యలు లేవు*

*గ్రామ పంచాయతీలో సరిగ్గా లేని రికార్డులు*

*జిల్లా కలెక్టర్ స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి:*

*గ్రామస్తుల డిమాండ్*

సంగారెడ్డి/పటాన్ చెరు, జూన్ 20: పటాన్ చెరు మండలంలోని ఇంద్రేశం గ్రామ పంచాయతీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై “ప్రశ్న ఆయుధం న్యూస్”లో వరుస కథనాలు రావడంతో జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా పంచాయతీ అధికారి స్పందిస్తూ అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. గతంలో గ్రామంలోని పలు కాలనీల్లో జీ ప్లస్ టూ అనుమతులు తీసుకుని ఐదు, ఆరు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని, పంచాయతీ అధికారులు ఆపకుండా ఉండిపోతున్నారని “ప్రశ్న ఆయుధం” వెల్లడించిన నేపథ్యంలో జిల్లా అధికారులు విచారణ చేశారు. అందులో భాగంగా 15 రోజుల క్రితం డీఎల్‌పీఓ విచారణ చేపట్టి, నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా డీపీఓ సాయిబాబా స్పందిస్తూ అక్రమంగా అనుమతికి మించి నిర్మించిన భవనాలను కూల్చివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయి అధికారుల సమక్షంలో కూల్చివేతలు చేపట్టాలని సూచించారు. డీపీఓ ఆదేశాలు జూన్ 13వ తేదీన వచ్చినప్పటికీ, ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, స్థానిక సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అదేవిధంగా మరో ఆసక్తికర విషయం బయటపడింది. గ్రామంలో వందల సంఖ్యలో అక్రమ భవనాలు ఉన్నాయని స్థానికులు చెబుతుంటే, అధికార రికార్డుల ప్రకారం కేవలం తొమ్మిది భవనాలు మాత్రమే తేలడం విశేషం. నిజానికి పంచాయతీ కార్యాలయంలో నిర్మాణ అనుమతుల రికార్డులు సక్రమంగా లేవని పలువురు ఆరోపిస్తున్నారు. అసలు ఎన్ని భవనాలకు అనుమతులు ఇచ్చారు.. ఎన్ని అక్రమంగా ఉన్నాయన్నదే అధికారులకూ స్పష్టంగా తెలియకపోవడం చూస్తుంటే భారీ మొత్తంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా బిల్డర్లు చట్టాలను తుంగలో తొక్కి భవనాలు నిర్మిస్తూ అమాయక ప్రజలకు అమ్ముతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

అలాంటి నిర్మాణాలను అరికట్టాల్సిన అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు స్పందించి ఇంద్రేశంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version