#అరుణాచలంలో_శివలింగానికి_దగ్గరగా_ఉంటే_ఏం_జరుగుతుందో_తెలుసా..
మనకి” అష్టమూర్తి తత్త్వము” అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు.
అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు,
సాకారోపాసన(రూపముతో) శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు.
కంచిలో పృథివీ లింగం,
జంబుకేశ్వరంలో జలలింగం,
అరుణాచలంలో అగ్నిలింగం,
చిదంబరంలో ఆకాశలింగం,
శ్రీకాళహస్తిలో వాయులింగం,
కోణార్కలో సూర్యలింగం,
సీతగుండంలో చంద్రలింగం,
ఖాట్మండులో యాజమాన లింగం –
ఈ ఎనిమిది అష్టమూర్తులు.
ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే.
కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.
అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం.
అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు.
అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు.
అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది.
అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది.
ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర.
అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు.
అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది.
కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు.
అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి.
అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.
అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది.
అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు.
అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు.
అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.
మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు.
దర్శనాత్ అభ్రశదసిజననాత్ కమలాలేస్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!
స్మరణము మనసుకు సంబంధించినది.
మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు.
కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం.
ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది.
అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది.
దాని పేరే అరుణాచలం.
అచలము అంటే కొండ.
దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది.
ఆకొండ అంతా శివుడే.
అక్కడ కొండే శివుడు.
కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు.
అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు.
అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి.
గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి.
ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది.
అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు.
అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం.
దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది.
ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి.
ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి.
అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.
ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది.
అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి.
ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు.
అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగస్థానం.
కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.
అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు.
అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.
మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది.
అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది.
అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.
అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు.
అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం.
🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩