ప్ర‌జారోగ్య రంగంలో జ‌వాబుదారీత‌నం, ప‌నితీరు ప‌ర్య‌వేక్ష‌ణ ప్ర‌వేశ‌పెట్టాం

ప్ర‌జారోగ్య రంగంలో జ‌వాబుదారీత‌నం, ప‌నితీరు ప‌ర్య‌వేక్ష‌ణ ప్ర‌వేశ‌పెట్టాం*

*ప‌నితీరు ఆధారంగా పోస్టింగులు, బ‌దిలీలు*

*అక్ర‌మాల‌కు, రాజ‌కీయ జోక్యానికి అడ్డుక‌ట్ట వేశాం*

*వార‌స‌త్వంగా వ‌చ్చిన స‌మ‌స్య‌ల్ని అధిగమిస్తున్నాం*

*కూట‌మి ప్ర‌భుత్వ మొద‌టి ఏడాదిలో ప్ర‌భుత్వ వైద్య రంగంలో మార్పున‌కు శ్రీకారం*

*ముఖ్య‌మంత్రికి నివేదిక స‌మ‌ర్పించిన వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌*

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం మొద‌టి ఏడాది పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌ల్ని అందించే దిశ‌గా సానుకూల వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించి మంచి ఫ‌లితాల్ని సాధించే దిశ‌గా మొద‌టి అడుగు వేశామ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు. ప్ర‌భుత్వ వైద్య రంగంలో భాగ‌స్వాములైన అంద‌రూ జ‌వాబుదారీత‌నం మ‌రియు క్ర‌మ‌శిక్ష‌ణ‌ల‌తో వ్య‌వ‌హ‌రించ‌డం అన్ని స్థాయిల్లో వైద్యులు, అధికారులు, ఇత‌ర సిబ్బంది ప‌నితీరును ప‌ర్య‌వేక్షిస్తూ ఫ‌లితాల్ని మ‌దింపు చేయ‌డం, బాగా ప‌నిచేసిన వారిని ప్రోత్స‌హించ‌డం మ‌రియు అక్ర‌మాలు, రాజ‌కీయ జోక్యాన్ని అడ్డుకోవ‌డం వంటి అంశాల ఆధారంగా వైద్య సేవ‌ల్ని మెరుగుప‌ర్చడానికి గ‌త ఏడాది కాలంగా కృషి చేసిన‌ట్లు మంత్రి వివ‌రించారు.

ఈ మేర‌కు మంత్రిగా బాధ్య‌త‌ల్ని స్వీక‌రించి ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా మంత్రిత్వ శాఖ ప్ర‌య‌త్నాలు, ఫ‌లితాల‌పై మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ముఖ్య‌మంత్రికి 5 పేజీల వివ‌ర‌ణాత్మ‌క నివేదిక‌ను స‌మ‌ర్పించారు. గ‌తేడాది జూన్ 16న ప‌ద‌వీ స్వీకారం చేసిన మంత్రి ఈనెల 16న ముఖ్య‌మంత్రికి త‌న నివేదిక‌ను పంపారు.

*క్ర‌మ‌శిక్ష‌ణ, జ‌వాబుదారీత‌నం*

గ‌త ప్ర‌భుత్వ ఐదేళ్ల పాల‌నా వైఖ‌రితో వైద్య సిబ్బందిలో గైరు హాజ‌రీ, జ‌వాబుదారీతనం లేక‌పోవ‌డం, వివిధ స్థాయిల్లో ప‌నితీరు మ‌రియు ఫ‌లితాల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ లోపించ‌డం కార‌ణంగా వైద్య సేవ‌ల నాణ్య‌త దెబ్బ‌తింద‌ని మంత్రి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గ‌త ప్ర‌భుత్వ వార‌స‌త్వంగా సంక్ర‌మించిన ఈ స‌మ‌స్య‌ల్ని అధిగ‌మించ‌డానికి నిర్దిష్ట ప్ర‌ణాళిక‌ల‌తో కూట‌మి ప్ర‌భుత్వం గ‌త ఏడాదిగా చేసిన కృషి స‌త్ఫ‌లితాల్ని ఇస్తోంద‌ని మంత్రి త‌న నివేదిక‌లో ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. వైద్య సిబ్బంది హాజ‌రు, ఓపీ మ‌రియు ఐపీ సేవ‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వం మొద‌టి సంవ‌త్స‌రంలో ఇతోధికంగా పెరుగుద‌ల‌ను సాధించామ‌ని, ఇది ప్ర‌జారోగ్య రంగంలో వ‌చ్చిన మార్పున‌కు నిద‌ర్శ‌న‌మ‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వివ‌రించారు. త‌త్ఫ‌లితంగా ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి జూన్ వ‌ర‌కు ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప్ర‌జాభిప్రాయ స‌ర్వేల్లో ప్ర‌భుత్వ వైద్య సేవ‌ల ప‌ట్ల సానుకూల‌త బాగా పెరిగింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

*ప్ర‌శ్నించ‌డం ద్వారా మెరుగైన పాల‌నా ప్ర‌క్రియ‌*

స‌మ‌గ్ర స‌మాచారంతో విశ్లేష‌ణాత్మ‌క ప్ర‌తిపాద‌న‌ల‌తో కూడిన నిర్ణ‌యాలు ఏ రంగంలోనైనా స‌త్ఫ‌లితాల్ని సాధించ‌డానికి ప్ర‌ధాన‌మ‌ని మంత్రి అన్నారు. ప‌రిపాల‌నా బాధ్య‌త‌ల్ని ప‌లు స్థాయిల్లో నిర్వ‌హిస్తున్న వైద్యుల్లో పాల‌నా విష‌యాల్లో స‌రైన శిక్ష‌ణ, నిపుణ‌త లోపించ‌డంతో పాటు మంత్రిత్వ శాఖ‌లో ప‌నిచేస్తున్న కింది మ‌రియు మ‌ధ్య స్థాయి అధికారుల సామ‌ర్ధ్యంలో కొర‌త కార‌ణంగా ప‌లు అంశాల‌కు సంబంధించి ప్ర‌తిపాద‌న‌లు రూపొందించ‌డంలో స‌మ‌గ్ర‌త లోపించ‌డాన్ని తాము గుర్తించామ‌ని, దీన్ని అధిగ‌మించ‌డానికి త‌న ప్ర‌య‌త్నం చేశాన‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. అట్టి లోపాలు త‌న దృష్టికొచ్చిన ప్ర‌తిసారీ నిర్మొహ‌మాటంగా త‌గు ప్ర‌శ్న‌లు లేవ‌నెత్త‌డంతో పాటు వివ‌ర‌ణ‌ల్ని కోర‌డం ద్వారా ద‌స్త్రాల్ని(ఫైళ్లు) స‌మ‌ర్పించే విధానంలో మార్పుల్ని తెచ్చామ‌ని ఆయ‌న అన్నారు. ఈ ప్ర‌య‌త్నం సానుకూల ఫ‌లితాల్ని ఇస్తోంద‌ని…య‌ధాలాపంగా ద‌స్త్రాల్ని పంపితే మంత్రి లేవ‌నెత్తే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంద‌న్న ఆలోచ‌న అధికారుల్లో క‌లిగి వారు జాగృత వ‌హిస్తున్నార‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ చెప్పారు.

*అక్ర‌మాలు, రాజ‌కీయ జోక్యానికి అడ్డుక‌ట్ట‌*

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌జారోగ్య రంగంలో నెల‌కొన్న అక్ర‌మాలు, రాజ‌కీయ జోక్యంపై మంత్రి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. జిల్లాస్థాయిలో జ‌రిగిన వైద్య సిబ్బంది నియామ‌కాల లిస్టులు క‌లెక్ట‌ర్ల కార్యాల‌యాల్లో కాకుండా మంత్రుల ఇళ్ల‌ల్లో త‌యార‌య్యాయ‌ని, ఆ కాలంలో నెల‌కొన్న అవినీతి,అక్ర‌మాలు, రాజ‌కీయ జోక్యానికి ఇది అద్దం ప‌ట్టింద‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. ఈ వైఖ‌రికి గ‌తేడాదిలో అడ్డుక‌ట్ట వేశామ‌ని ఆయ‌న తెలిపారు. కూటమి ప్ర‌భుత్వం మొద‌టి ఏడాదిలోనే 8,000 పైగా వైద్యులు, ఇత‌ర సిబ్బంది నియామ‌కాన్ని ఎటువంటి రాజ‌కీయ జోక్యం లేకుండా చేప‌ట్టామ‌ని మంత్రి  స‌త్య‌కుమార్ యాద‌వ్ వ్యాఖ్యానించారు. వివిధ నిర్మాణ ప‌నులు, మందులు మ‌రియు ప‌రిక‌రాల కొనుగోళ్ల‌లో నియ‌మ‌నిబంధ‌నల ప్ర‌కారం టెండ‌ర్ల‌పై నిర్ణ‌యాల్ని తీసుకోవ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న వివ‌రించారు.

*మెరుగైన ప‌నితీరుకు ప్రోత్సాహం*

గ‌తానికి భిన్నంగా వివిధ స్థాయిల్లో మంచి ప‌నితీరును క‌న‌ప‌ర్చిన వారిని ప్రోత్స‌హించే దిశ‌గా తాము నిర్దిష్ట‌మైన చ‌ర్య‌ల్ని చేప‌ట్టిన‌ట్లు మంత్రి తెలిపారు. ఈ మేర‌కు జిల్లా స్థాయి అధికారులైన డిఎంహెచ్వోలు, డిసిహెచ్‌య‌స్‌లతో పాటు ప్ర‌భుత్వాసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్ల పోస్టింగులు, బ‌దిలీలు చేశామ‌ని ఆయ‌న వివ‌రించారు.

*వ్య‌త్యాసం*

ఐదేళ్ల గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌జారోగ్యానికి సంబంధించిన ప‌లు అంశాలు నిర్ల‌క్ష్యానికి గుర‌య్యాయ‌ని మంత్రి అన్నారు. కేంద్రం నుండి కొత్త ప‌థ‌కాలు, నిధుల మంజూరులో ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌య్యింద‌ని ఆయ‌న తెలిపారు. దీనికి భిన్నంగా కూట‌మి ప్ర‌భుత్వ మొద‌టి ఏడాదిలోనే రూ.1,065 కోట్ల వ్య‌యంతో గ్రామ స్థాయిలో 3,318 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణానికి కేంద్ర అనుమ‌తిని పొందామ‌ని, 10 నూత‌న క్రిటిక‌ల్ కేర్ బ్లాకులు, 13 స‌మీకృత ప్ర‌జారోగ్య ప్ర‌యోగ శాల‌లు మంజూర‌య్యాయ‌ని, మున్నెన‌డూ లేని విధంగా ఆయుష్ సేవ‌ల‌కు 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.83 కోట్ల కేంద్ర నిధుల మంజూరు, ఆహార ప‌దార్ధాల నాణ్య‌త నిర్ధార‌ణ నిమిత్తం ప్ర‌యోగ‌శాలల నిర్మాణానికి రూ.90 కోట్ల కేంద్ర నిధులు పొంద‌గ‌లిగామ‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ముఖ్య‌మంత్రికి వివ‌రించారు.

*కృషికి గుర్తింపు*

క్షేత్ర స్థాయిలో ఆరోగ్య ప‌థ‌కాల అమ‌లుపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ, ఫ‌లితాల మ‌దింపు ప్రాతిప‌దిక‌న 2024-25 కాలంలో రాష్ట్రంలో నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ అమ‌లు తీరును కేంద్ర ప్రభుత్వం ప్ర‌శంసిస్తూ ప‌నితీరు ప్రోత్సాహ‌కంగా రాష్ట్రానికి రూ.100 కోట్లు విడుద‌ల చేసింద‌ని, మొద‌టి ఏడాదిలో రాష్ట్రంలో ప్ర‌జారోగ్య సేవ‌ల్ని మెరుగుప‌ర్చ‌డానికి కూట‌మి ప్ర‌భుత్వం కృషికి ఇది సాక్షాత్కార‌మ‌ని మంత్రి  సత్య కుమార్ ముఖ్య‌మంత్రి దృష్టికి తెచ్చారు.

 

*మార్పు తెచ్చాం-మ‌రింత‌గా కృషి చేయాలి*

కూట‌మి ప్ర‌భుత్వం మొద‌టి ఏడాదిలో ప్ర‌భుత్వ వైద్య రంగ పాల‌న మ‌రియు ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లందించ‌డంలో నిర్దిష్ట విధానాల‌తో ప్ర‌జారోగ్య రంగంలో మార్పు తేగ‌లిగామ‌ని…అయితే ముఖ్య‌మంత్రి ఆశ‌యాల మేర‌కు ఆరోగ్యాంధ్రప్ర‌దేశ్ సాధ‌న దిశ‌గా చేయాల్సింది ఇంకా ఉంద‌ని, ఆమేర‌కు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని మంత్రి  స‌త్య‌కుమార్ యాద‌వ్ ముఖ్య‌మంత్రికి హామీ ఇచ్చారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment