వండ్రికల్ పాఠశాల వరండాలో విద్యాబోధన: జిల్లా కలెక్టర్ ఆగ్రహం
నిర్లక్ష్యానికి HM, పంచాయితీ సెక్రటరీకి నోటీసుల జారీ ఆదేశించిన: జిల్లా కలెక్టర్
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబర్ 30
కామారెడ్డి జిల్లా పరిధిలోని గాంధారి మండలం వండ్రికల్ గ్రామంలోని అప్పర్ ప్రైమరీ స్కూల్ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేసి అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులను వరండాలో కూర్చోబెట్టి తరగతులు నిర్వహించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్, తప్పనిసరిగా తరగతి గదుల్లోనే బోధన జరగాలని స్పష్టం చేశారు.
పాఠశాల ఆవరణ చుట్టూ చెత్తా చెదారం పేరుకుపోయి ఉండటంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
అలాగే మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న వంటగదిని పరిశీలించి, భోజన నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు పోషకాహారం అందేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ప్రధానోపాధ్యాయునికి నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి (DEO)కు ఆదేశించారు. శానిటేషన్లో నిర్లక్ష్యం వహించిన పంచాయితీ సెక్రటరీ వెంకటాచారికి నోటీసులు జారీ చేయాలని పంచాయితీ అధికారి మురళీకి జిల్లా కలెక్టర్ సూచించారు.
ప్రైమరీ స్కూల్లలో అందించిన ఫ్రీ స్కూల్ కిట్ మెటీరియల్ చిన్నారులకు అందుబాటులో ఉంచాలని, అన్ని పాఠశాలల్లో వాటిని సమర్థవంతంగా ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ తనిఖీలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, DEO రాజు, DRDO సురేందర్, DPO మురళి, తహసిల్దార్ రేణుక, MPDO, సంబంధిత విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.