ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, ఎల్.ఆర్.ఎస్ పై మంత్రి పొంగులేటి సమీక్ష

*ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, ఎల్.ఆర్.ఎస్ పై మంత్రి పొంగులేటి సమీక్ష*

 * ఏప్రిల్ 30 లోపు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి

 * ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతి దశలో లబ్ధిదారులకు సహకారం అందించాలి

 * భూ భారతి చట్టం ద్వారా ప్రజల భూ సమస్యల పరిష్కారానికి కృషి

 * ఎల్.ఆర్.ఎస్ క్రమబద్ధీకరణ ఫీజులో 25% రాయితీ గడువు పొడిగింపు ఉండదు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 22

IMG 20250422 WA2535

సొంతింటి కల నిజం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడత లబ్ధిదారుల ఎంపికను అధికారులు పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.

మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుంచి రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌతమ్ లతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పేదవారు సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్రజా ప్రభుత్వం రూ. 5 లక్షలను ఉచితంగా సబ్సిడీ కింద అందిస్తుందని, దేశంలో మరే రాష్ట్రంలో ఇంత పెద్ద సహాయం అందడం లేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ప్రభుత్వాలు సహాయం చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని, ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతి పర్యవేక్షించేందుకు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని మంత్రి ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులు, జనాభా ఆధారంగా గ్రామాలకు, మున్సిపల్ వార్డులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పూర్తి చేయాలని సూచించారు.

గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లోని ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల జాబితా ఎంపిక చేయాలని, కమిటీ ఆమోదించిన ప్రతి 200 ఇళ్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఏప్రిల్ 30 లోపు ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని మంత్రి అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని, అనర్హులు ఉంటే తొలగించాలని ఆదేశించారు.

ప్రతి మండలంలో ఎంపిక చేసిన పైలెట్ గ్రామంలో బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకున్న వారికి మొదటి విడతగా రూ. 1 లక్ష విడుదల చేశామని, ఇండ్ల నిర్మాణం పెరుగుతున్న నేపథ్యంలో సామాగ్రి ధరలు పెరగకుండా, కృత్రిమ కొరత సృష్టించకుండా చూడాలని మంత్రి పేర్కొన్నారు.

ఇసుక కొరత రాకుండా చూడాలని, బలహీన వర్గాల ఇంటి నిర్మాణానికి ఉచితంగా సరఫరా చేయాలని, ప్రతి మండల కేంద్రంలో ఇసుక అందుబాటులో ఉంచాలని మంత్రి తెలిపారు. మండలంలో నిర్మించిన మోడల్ ఇళ్లను లబ్ధిదారులకు చూపించాలని సూచించారు. పేదలకు ఇంటి నిర్మాణంలో ప్రతి దశలో అధికారులు సహాయం అందించాలని మంత్రి పేర్కొన్నారు.

వర్షాకాలం ప్రారంభం కంటే ముందే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని, రూ. 5 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నందున అత్యంత నిరుపేదలను మొదటి విడతలో ఎంపిక చేయాలని మంత్రి అన్నారు. సివిల్ ఇంజనీరింగ్ లో అత్యుత్తమ మార్కులు వచ్చిన యువకులను తాత్కాలిక ప్రాతిపదికన ఇంజనీర్లుగా నియమిస్తున్నామని, వారికి శిక్షణ అందించి త్వరలోనే మండలాలకు కేటాయిస్తామని తెలిపారు.

ప్రతి మండలంలో జరిగే ఇందిరమ్మ ఇండ్ల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తూ, లబ్ధిదారులకు సహాయం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో స్లమ్ ఏరియాల్లో జి+3 మోడల్లో ఇండ్లు కట్టించేందుకు లబ్ధిదారులు ముందుకు వస్తే, రాబోయే విడతల్లో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

భూ భారతి చట్టం పైలెట్ ప్రాజెక్టు కింద 4 మండలాల్లో అమలు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తయిన తర్వాత, ప్రతి జిల్లాలో ఒక మండలం నుంచి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ వర్క్ షాప్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి జిల్లాకు అవసరమైన సర్వే సామాగ్రి అందిస్తామని అన్నారు. భూ భారతి చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులపై ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రజలకు భారం కాకుండా 25% రాయితీని అందించామని, దీనిని ముఖ్యమంత్రి ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించారని తెలిపారు. ఎల్.ఆర్.ఎస్ 25% రాయితీ గడువు మరోసారి పొడిగించబోమని, ఈ విషయాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియజేసి, ఆమోదం పొందిన దరఖాస్తుల ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్లు రాధికా గుప్త, విజయేందర్ రెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now