ఇండియా, పాక్ ఉద్రిక్తత వేళ ఇండియాకు ఇరాన్ మంత్రి

*ఇండియా, పాక్ ఉద్రిక్తత వేళ ఇండియాకు ఇరాన్ మంత్రి*

భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఇండియాకు వచ్చారు. ఇండియా, ఇరాన్ స్నేహ సంబంధాలు మొదలై 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన భారత్‌కు విచ్చేశారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న 20వ ఇండియా, ఇరాన్ జాయింట్ కమిషన్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ అవ్వనున్నారు.

భారత విదేశీ వ్యవహారాల శాఖ.. అరాగ్చీకి సాదర స్వాగతం పలికింది. ఈ నేపథ్యంలోనే జై శంకర్ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ‘ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీకి సాదర స్వాగతం. ఆయన ఢిల్లీలో జరుగుతున్న ఇండియా, ఇరాన్ జాయింట్ కమిషన్ మీటింగ్‌లో పాల్గొనడానికి వచ్చారు. ఇండియా, ఇరాన్ స్నేహ సంబంధాలు మొదలై 75 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను రివ్యూ చేసుకుని, మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తాం’ అని వెల్లడించారు.

ఇక, ఈ కార్యక్రమం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరగనుంది. పలు కీలక విషయాలపై రెండు దేశాల మంత్రులు చర్చించే అవకాశం ఉంది. ట్రేడ్, ఎనర్జీ, కనెక్టివిటీతో పాటు రీజనల్ కోఆపరేషన్‌పై చర్చ జరగనుంది. కాగా, అరాగ్చీ ఇరాన్ విదేశాంగ మంత్రిగా 2024లో బాధ్యతలు చేపట్టారు. విదేశాంగ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియా రావటం ఇదే మొదటి సారి. ఈ రోజు జాయింట్ కమిషన్ మీటింగ్ అయిపోగానే ఆయన రాష్ట్రపతి భవన్ వెళ్లనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది మర్మును కలవనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment