*ఆపరేషన్ సిందూర్.. జేషే మహ్మద్ చీఫ్ మసూద్కు భారీ షాక్*
*దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ అజర్ మసూద్ కుటుంబసభ్యులు హతం*
ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాక్ ఉగ్రస్థావరాలపై నిర్వహించిన మెరుపు దాడుల్లో పదుల సంఖ్యలో మరణించారు. అయితే, ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ అజర్ మసూద్ కుటుంబసభ్యులు కూడా మరణించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. బహావల్పూర్లో జరిగిన దాడిలో మజూర్ సోదరితో పాటు ఐక్యరాజ్యసమితి ఉగ్రవాది ప్రకటించి మరో బంధువుతో సహా మొత్తం 10 మంది కుటుంబసభ్యులు బాంబు ధాటికి తుత్తునీయలయ్యారు.
బుధవారం భారత దళాలు పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లోగల ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. జైషే మహ్మద్, లష్కరే తయ్యబా ప్రధాన కార్యాలయాలున్న ప్రాంతాల్లోనే ఈ దాడులు జరిగాయి. ఉగ్రవాదుల స్థావరాలనే తాము టార్గెట్ చేసుకున్నామని భారత్ స్పష్టం చేసింది. సామాన్యులకు అపాయం కలుగకుండా ఆపరేషన్ నిర్వహించినట్టు వెల్లడించింది.
ఈ దాడిలోో పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ 25 నిమిషాల పాటు బాంబుల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. అత్యంత కచ్చితత్వంతో జరిపిన ఈ దాడుల్లో సుమారు 70 మంది ఉగ్రవాదులు అంతమయ్యారు. పీఓకే ఉగ్రస్థావరాలతో పాటు పాక్లోని ఐదు ఉగ్రక్యాంపులను కూడా భారత్ ధ్వంసం చేసింది.
కాగా, భారత్ చర్యలపై స్పందించిన పాక్.. ఈ ఆపరేషన్ను యుద్ధ చర్యగా అభివర్ణించింది. అయితే, భారత్ తన చర్యలను కట్టిపెడితే తాము ప్రతి దాడికి దిగబోమని కాళ్లబేరానికి వచ్చింది. ఇదిలా ఉంటే భారత్ కూడా పాక్కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితి మరింత దిగజార్చేలా దాడులకు దిగితే గట్టి బదులిస్తామనని వార్నింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు భారత్కు అండగా నిలిచాయి. స్వీయ రక్షణ భారత దేశ హక్కు అని ముక్తకంఠంతో పేర్కొన్నాయి.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తాము ఎలాంటి మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేయలేదని పత్రికా సమావేశంలో భారత ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పేర్కొన్నారు. అయితే, పాక్ చేపట్టే ఎలాంటి దుందుడుకు చర్యలకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కచ్చితమైన నిఘా సమాచారంతో తాము ఈ లక్ష్యాలను ఎంచుకున్నామని అన్నారు.