*భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ.. స్వాగతించిన జమ్మూకశ్మీర్ సీఎం*
భారత్, పాక్ మధ్య తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదరడాన్ని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. ఈ ఉద్రిక్తతల్లో బాధితులుగా మారిన వారిని ఆదుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. రెండు రోజులుగా పాక్ దళాలు జమ్మూకశ్మీర్లోని సరిహద్దు జిల్లాల్లో పౌర నివాసాలను కూడా టార్గెట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో సామాన్య పౌరులు కొందరు మృతి చెందగా మరెంతో మంది గాయాల పాలయ్యారు. సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే, పాక్పై భారత్ యుద్ధం తప్పదన్న తరుణంలో ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. పూర్తిస్థాయి కాల్పుల విరమణ తక్షణం అమల్లోకి రావడాన్ని స్వాగతించారు. ఈ పరిణామాలు కాస్తంత ముందుగా జరిగి ఉంటే ఎన్నో ప్రాణాలను కాపాడగలిగి ఉండేవారమని అన్నారు. ఈ ఘర్షణలతో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ముదింపు వేసి బాధితులకు సాంత్వన కలిగించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. గాయపడ్డ వారందరినీ ప్రభుత్వ పథకాలతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో ఎయిర్పోర్టులు తెరుచుకుని హజ్ యత్రా యథాతథంగా కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.