*మంచి ఓపిక, సహనం ఉన్న న్యాయమూర్తి జస్టిస్ డా. వి.ఆర్.కె.కృపాసాగర్*
*- రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్*
అమరావతి, జూన్ 18: మంచి ఓపిక, సహనం ఉన్న న్యాయమూర్తిగా జస్టిస్ డా.వి.ఆర్.కె.కృపాసాగర్ పేరుతెచ్చుకున్నారని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అభినందించారు. కేసుల వాదన విషయంలో ఇరు పార్టీలకు తమ వాదనను స్వేచ్చగా వినిపించుకునే అవకాశాన్ని కల్పించి న్యాయమైన, సంతృప్తికరమైన నిర్ణయాన్ని తీసుకోవడంలో వీరికి వీరే సాటన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందజేస్తున్న జస్టిస్ డా.వి.ఆర్.కె. కృపాసాగర్ పదవీ విరమణ సందర్బంగా బుధవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ డా.వి.ఆర్.కె.కృపాసాగర్ సేవలను కొనియాడారు. 1994 లో మునిసిఫ్ మెజిస్ట్రేట్ గా న్యాయ వ్యవస్థలో ప్రస్తానాన్ని ప్రారంభించి న్యాయ సేవలు అందించడంలో మంచి ప్రతిభ కనబరుస్తూ స్వయం కృషితో అంచలంచలుగా ఎదుగుతూ 2022 ఆగస్టు 4 న హైకోర్టు జడ్జి గా నియమించబడ్డారని అభినందించారు. వీరు వ్రాసిన పలు ఆర్టికల్స్ పలు లా జర్నల్స్ లో ప్రచురితమై యువ న్యాయవాదులకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ఏ.పి. జ్యూడిషియల్ అకాడమీ బోర్డు గవర్నరుగానే కాకుండా పలు కమిటిల్లో వీరు సభ్యులుగా ఉంటూ న్యాయ వ్యవస్థకు ఉత్తమమైన సేవలు అందజేయడం వీరి ప్రతిభకు నిదర్శనమన్నారు. పరిపాలనా పరంగానే కాకుండా న్యాయవ్యవస్థ పరంగా ప్రముఖ సేవలు వీరు అందజేశారన్నారు. హైకోర్టు జడ్జిగా మూడేళ్ల పాటు సేవలు అందజేసిన వీరు విభిన్న అంశాలను పర్యవేక్షిస్తూ అంకిత భావంతో విధులనల నిర్వహిస్తూ పలు కేసులను కూడా పెద్ద ఎత్తున పరిష్కరించి న్యాయపరమైన అంశాల, చట్టాలపై వీరికి ఉన్న సమగ్ర అవగాహనను, పట్టును నిరూపించుకున్నారని ప్రశంసించారు.
పదవీ విరమణ చేస్తున్న న్యాయమూర్తి డా.వి.ఆర్.కె. కృపాసాగర్ మాట్లాడుతూ న్యాయ అంశాలపై మంచి పట్టుతో అంకిత భావంతో విధులు నిర్వహించే తోటి న్యాయమూర్తులు తనకు మంచి ప్రేరణగా నిలిచారని, వారి స్పూర్తి, ప్రేరణతోనే న్యాయ మూర్తిగా తన విధులను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. సామాజిక విలువలు, ఆశయాలు, న్యాయ పరమైన అంశాలను పరిరక్షించే భాద్యత న్యాయమూర్తిపై ఉందని, ఆ కోణంలోనే ఇరు పక్షాల వాదనలను వింటూ న్యాయమైన, సంతృప్తి కరమైన తీర్పును వెలువరించాల్సి ఉంటుదని ఆయన అన్నారు. అందరి సహకారంతో నిజాయితీ, క్రమశిక్షణ మరియు బలమైన కర్తవ్య భావనతో న్యాయ వ్యస్థకు గణనీయమైన సేవలు అందజేయడం జరుగుచున్నదన్నారు. న్యాయ మూర్తి పదవి గౌరవాన్ని, ప్రతిష్టను ఇనుమడించే విధంగా విభిన్న మైన కేసులను పరిష్కరించి వాజ్యదారులకు సంతృప్తికరమైన సేవలను అందజేయడం జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదములు తెలిపారు. హైకోర్టు జడ్జిగా తన విధులను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ వ్యవస్థ అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ మరియు హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.చిదంబరం మాట్లాడుతూ జస్టిస్ డా.వి.ఆర్.కె. కృపాసాగర్ న్యాయ వ్యవస్థకు ఉత్తమమైన సేవలు అందించారని కొనియాడారు.
అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈవీడ్కోలు కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయ మూర్తులు, అదనపు అడ్వకేట్ జనరల్ ఇ.సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావు , పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ పార్థసారధి, పలువురు ఇతర రిజిష్ట్రార్లు,సీనియర్ న్యాయవాదులు,బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎ.వేణుగోపాలరావు మరియు హైకోర్టు ఉద్యోగులు, ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ, ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.