*మీడియా ఛానల్పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి..స్పందించిన కేటీఆర్*
బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ సహా మరికొందరు బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ లోని ఓ మీడియా ఛానల్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూదని అన్నారు. అలానే అబద్ధాలకు అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావు ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కానీ ఈనాటి దిగజారుడు రాజకీయాల్లో గుంపు మేస్త్రీ, అతని మిత్రులు అన్నీ మెయిన్ స్ట్రీమ్కు తీసుకువచ్చారని అన్నారు. అంతే కాకుండా బీఆర్ఎస్ శ్రేణులు ప్రశాంతంగా ఉండాలన్నారు. కార్యకర్తల బాధ, గౌరవం తనపై, పార్టీపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోగలనని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలించినప్పుడు అబద్ధాలు, నిందలు తప్పవని చెప్పారు. సిగ్గులేకుండా బురద జల్లడంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోవడంపై ఫోకస్ పెట్టాలని కార్యకర్తలకు నాయకులకు సూచించారు.