బలవంతపు భూసేకరణకు హక్కు లేదు

భూసేకరణకు
Sample Headlines (Telugu)
  1. “లగచర్ల భూసేకరణ వివాదం: గిరిజనులకు న్యాయం చేస్తామని ఎస్టీ కమిషన్ హామీ”
  2. “భూముల బలవంతపు స్వాధీనం: జాతీయ కమిషన్ ఆగ్రహం”
  3. “లగచర్ల ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ దృష్టి”
  4. “పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ విచారణ వాయిదా”
  5. “పరిగి డీఎస్పీపై వేటు: లగచర్ల దాడి ఘటనలో కీలక పరిణామం”

 ప్రజలను స్వేచ్ఛగా బతకనివ్వండి

– బలవంతపు భూసేకరణకు హక్కు లేదు

– అక్రమ అరెస్టులు ఆపాలి : జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌

– పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీ, సీఎస్‌లకు ఆదేశం

– ఫార్మా బాధిత గ్రామాల్లో పర్యటన

– కమిషన్‌ ఎదుట తమ గోడు వెల్లబోసుకున్న బాధితులు

– దాడులతో సంబంధం లేదని ఆవేదన

– పట్నం నరేందర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా… కస్టడీపై తీర్పు బుధవారానికి

– జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు మెయిల్‌లో ప్రజాసంఘాల ఫిర్యాదు

– లగచర్ల ఘటనలో పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డిపై వేటు

 

బలవంతపు భూసేకరణ చేసేందుకు ఎవరికీ హక్కు లేదని జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ స్పష్టం చేశారు. ఫార్మా భూ బాధిత గ్రామాల్లో నుంచి పోలీసులను తరలించి, ప్రజలను స్వేచ్ఛగా బతకనివ్వండని ప్రభుత్వానికి సూచించారు. అలాగే గిరిజన బిడ్డల అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఫార్మా బాధిత గ్రామాలైన వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, రోటిబండ తండా గ్రామాల్లో జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు పర్యటించారు. ఇటీవల కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులపై జరిగిన దాడి, అనంతరం అరెస్టులు, ఇతర పరిణామాలపై ఆయా గ్రామాల ప్రజలతో చర్చించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్టీ కమిషన్‌ ముందు ఫార్మా బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, అధికారులపై దాడిలో తమకు ఎలాంటి సంబంధమూ లేదని, అన్యాయంగా తమ వారిని అరెస్టు చేశారని బాధితులు వాపోయారు. దాడిలో లేని వారిని కూడా అరెస్టు చేశారని, పలువురిని పోలీసులు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వారిని వెంటనే జైల్‌ నుంచి విడిపించి, న్యాయం చేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని ఎస్టీ కమిషన్‌ సభ్యులు హామీ ఇచ్చారు. అనంతరం ఎస్టీ కమిషన్‌ సభ్యులు హుస్సేన్‌నాయక్‌ మీడియాతో మాట్లాడారు..

లగచర్ల ఘటనపై పది రోజుల్లో తమకు నివేదక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ, సీఎస్‌లకు ఆదేశాలు జారీ చేశారు. నివేదిక ఇచ్చిన తర్వాతే ఏమి చేయాలో నిర్ణయించుకోవాలన్నారు. మార్కెట్‌ ధరలకు భూములను తీసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రభుత్వ ధరకు తీసుకుంటామంటే సరైంది కాదని తెలిపారు. భూమి తరతరాలుగా అభిమానంగా వస్తుందని, దానితో వారి జీవితాలు ముడిపడి ఉంటాయని అన్నారు. ఇక్కడ జరిగిన ఘటనలతో భయభ్రాంతులకు గురై గిరిజనులు ఊర్లు వదిలి పారిపోవడం బాధనిపిస్తుందన్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.పది లక్షలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇస్తామంటున్నదని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. రైతులు మాత్రం భూములు ఇవ్వబోమని చెబుతున్నారన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టు ఇక్కడ పరిస్థితులు లేవని ప్రజలు చెబుతున్నట్లుగానే ఇక్కడ పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. ఇక్కడ ప్రజలు గ్రామాలు వదిలి పారిపోయారన్నారు. కొంతమంది నాయకులు వెనుక నుంచి రైతులతో ఈ తతంగం నడిపించినట్టు కొంత కనిపిస్తుందని చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో గొడవ జరిగిందని తెలిసినా కలెక్టర్‌ రక్షణ లేకుండా రావడం సరికాద న్నారు. ఇక్కడి రైతులపై రాత్రి సమయాల్లో వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టి అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని తెలిపారు.

‘పట్నం’ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ, కస్టడీపై తీర్పు వాయిదా

లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో బీఆర్ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వికారాబాద్‌ కోర్టు వాయిదా వేసింది. కొడంగల్‌ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన రిమాండ్‌ ఆర్డర్‌ను క్వాష్‌ చేయాలని నరేందర్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ క్వాష్‌ పిటిషన్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో బెయిల్‌ పిటిషన్‌ విచారణను వాయిదా వేస్తున్నట్టు వికారాబాద్‌ జడ్జి సోమవారం తెలిపారు. విచా రణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. అలాగే, నరేందర్‌రెడ్డిని 7 రోజులు కస్టడీకి కోరుతూ పోలీసులు కొడంగల్‌లో వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. దీనిపై వాదనలు విన్న కొడంగల్‌ కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది.

జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ప్రజాసంఘాల ఫిర్యాదు

లగచర్ల ఘటనపై సోమవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌, మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వం, పోలీసులపై ఫిర్యాదు చేసినట్టు వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస్స చంద్రయ్య తెలిపారు. వీరు మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల ఘటనపై ఫిర్యాదు చేయగా.. కేసు నెంబర్‌ 9141/ఐఎన్‌/2024 కేటాయించినట్టు తెలిపారు. ఇప్పటికైనా ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

పరిగి డీఎస్పీ కరుణా సాగర్‌రెడ్డిపై వేటు

లగచర్లలో ఈ నెల 11న అధికారులపై జరిగిన దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వికారాబాద్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ బృందంపై దాడి ఘటనలో ఉన్నతాధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా పరిగి డీఎస్పీగా ఉన్న కరుణా సాగర్‌రెడ్డిపై వేటు వేసింది. డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిగి కొత్త డీఎస్పీగా శ్రీనివాస్‌ను నియమించింది.

Join WhatsApp

Join Now