న్యాయవాదులు ఉత్సాహంగా పనిచేయాలి

  • న్యాయవాదులు ఉత్సాహంగా పనిచేయాలి
  • రాష్ట్ర హైకోర్టు జడ్జి మరియు జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి బి.విజయసేన్

సిద్దిపేట జిల్లా, 11 జనవరి 2025 : ప్రజలకు సత్వర న్యాయం అందాలంటే న్యాయవాదులు ఉత్సాహంగా పనిచేయాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి మరియు జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి బి.విజయసేన్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లాలోని చేర్యాల పట్టణంలో ఫస్ట్ క్లాస్ సివిల్ జూనియర్ కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేర్యాల, కొమరవెల్లి, ధూల్ మిట్ట మరియు మద్దూర్ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలను అందించేందుకు చేర్యాల పట్టణంలో జూనియర్ సివిల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. లాయర్ ఉద్యోగం చాలా స్వేచ్ఛతో కూడుకున్నదని ప్రజలకు మంచి జరగాలంటే మీరు ఉత్సాహంతో పనిచేసి ఈ కోర్టు ద్వారా ఈ ప్రాంత ప్రజలకు కాలయాపన చేయకుండా న్యాయ సేవలు అందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. కోర్టు కేసుల పరిష్కారంలో నూతన టెక్నాలజీ చాలా ఉపయోగకంగా ఉంటుందని భవిష్యత్తులో ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ కూడా న్యాయ వ్యవస్థలో కీలకపాత్ర పోషించనున్నదని అన్నారు. కుటుంబ తగాదాల కేసులను సామాజిక స్పృహతో పరిష్కరించాలని అన్నారు. ప్రస్తుతం ప్రజల ఆర్థిక స్థితి గతంతో పోలిస్తే పెరిగిందని, 20, 30 సంవత్సరాలుగా ఎంతో కష్టపడితే అది సాధ్యమైందని చెప్పారు. ప్రస్తుతం పెరిగిన ఆర్థిక స్థితిని చూసి ఈ జనరేషన్ కు కష్టం విలువ తెలియకుండా పెంచరాదని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వవలసింది ఆస్తులు, అంతస్తులు కాదని మంచి విద్యా క్రమశిక్షణ అందించాలని అన్నారు. సీనియర్ లాయర్లు జూనియర్ లాయర్లకు అవకాశాలు కల్పించి వారు వృత్తిపరంగా ఎదిగేలా ప్రోత్సహించాలని అన్నారు. ఈ కోర్టు ఓపెనింగ్ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మిమ్మల్ని చూస్తేనే ఈ ప్రాంతంలో కోర్టు ఏర్పాటు ఎంత అవసరమో తెలుస్తుందని అన్నారు. జిల్లా ప్రిన్సిపాల్ , సెషన్స్ జడ్జి సాయి రమాదేవి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకు ప్రముఖ స్థానం ఉందని చేర్యాలలో కోర్టు ఏర్పాటుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అన్నారు. ఈ ప్రాంత పౌరులకు సత్వర న్యాయ సేవలు అందించేందుకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఇన్చార్జి జిల్లా కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ ఈ ప్రాంత దీర్ఘకాలిక అభివృద్ధికి ఈ కోర్టు ఏర్పాటు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. సిద్దిపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్. జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 20 సంవత్సరాల కల చేర్యాలలో కోర్టు ఏర్పాటు అని దానిని సహకారం చేసినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. ఈ సందర్భంగా జనగామ శాసనసభ్యులు పళ్ళ రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మి లు హైకోర్టు జడ్జిని మరియు జిల్లా జడ్జిని పూల బోకే శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాసాధికారి సంస్థ ద్వారా దివ్యాంగులకు ఉపకరణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ డిస్టిక్ జడ్జ్, సిద్దిపేట, జనగామ, గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment