లోకేశ్వర్ నగర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై నాయకుల హామీ
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 16
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 97వ సర్వే నంబర్ లోకేశ్వర్ నగర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, కాలనీవాసుల పిలుపు మేరకు నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు కొండ జంగారెడ్డి, ఉమా శంకర్ గౌడ్ కాలనీని సందర్శించారు.
మౌలిక వసతుల సమస్యలు, ముఖ్యంగా దెబ్బతిన్న రోడ్లు, నిరంతరం ఎదురవుతున్న డ్రైనేజీ సమస్యల గురించి స్థానికులు నాయకులకు వివరించారు. కాలనీవాసుల ఆవేదనను శ్రద్ధగా విన్న నాయకులు, సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గోధుమకుంట మాజీ ఎంపీటీసీ మంచాల కిరణ్ జ్యోతి ప్రవీణ్, మాజీ వార్డ్ మెంబర్ చీర శేఖర్, రాజు, సురేష్ నాయక్తో పాటు అనేక మంది కాలనీవాసులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించడానికి నాయకులు ముందుకు రావడంపై కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.