సమరసతా సాహిత్యంతో ఐకమత్యం సాధిద్దాం
ప్రశ్న ఆయుధం, సెప్టెంబర్ 29, కామారెడ్డి :
కవులు రచయితలు సమరసతా సాహిత్యం సృష్టించి సమాజ ఐకమత్యాన్ని సాధించాలని సామాజిక సమరసతా వేదిక కళా విభాగం రాష్ట్ర కన్వీనర్ బండిరాజుల శంకర్ పిలుపునిచ్చారు. సామాజిక సమరసతా వేదిక కామారెడ్డి జిల్లా కేంద్రం ఆధ్వర్యంలో వశిష్ఠ డిగ్రీ కళాశాలలో సమరసతా మూర్తులు దున్న ఇద్దాసు, గుర్రం జాషువా, బోయి భీమన్న, చిలకమర్తి లక్ష్మీ నరసింహంల జయంతి వేడుకలు & కవి సమ్మేళనం జరిగింది. ప్రధాన వక్తగా హాజరైన బండ్రాజుల శంకర్ మాట్లాడుతూ హిందూధర్మంలో అంటరానితనానికి తావు లేదని సోదాహరణంగా రాముని జీవితాన్ని వివరించారు. కవులు సమాజాన్ని కలిపే వారని, సమాజ హితంకోరే సాహిత్యాన్ని వ్రాయాలని కోరారు. ఆది శంకరులు, రామానుజులు, వివేకానందుల వంటి వారు మానవాళి హితం కోరే పద్ధతులను ఏర్పాటు చేశారని చెప్పారు. ఎక్కడా వివక్షని పాటించలేదని అన్నారు. మహనీయుల స్ఫూర్తితో మనం సామాజిక సమరసతకు నడుం బిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన యాదాద్రి జిల్లా రచయితల సంఘం అద్యక్షులు పోరెడ్డి రంగయ్య మాట్లాడుతూ కవితలు సజీవంగా సదృశ్యంగా ఉండాలని సమాజ శ్రేయస్సును ప్రతిబింబించే స్థాయిలో ఉండాలనీ ఆకాంక్షించారు. గౌరవ అతిథులు తెలుగు లెక్చరర్ సామల కిరణ్ మాట్లాడుతూ.. సమాజం విచ్చిన్నం చేసే కవితలు దేశానికి ప్రమాదం అని సూచించారు . మరో గౌరవ అతిథి ప్రఖ్యాత ప్రముఖ కవి అష్టావధాని బండకాడి అంజయ్య గౌడ్ మాట్లాడుతూ వచన కవితల కంటే పద్య కవితలు ప్రజల్లో ఆమోదయోగ్యం గా ఉంటుందని ఇలాంటి ప్రత్యేకతలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విభాగ్ సహ సంయోజకులు సంగన్న గారి బాలరాజు గౌడ్, గౌరవ అధ్యక్షులు తుమ్మ రామచంద్రం, సామాజిక సమరసతా వేదిక జిల్లా అధ్యక్షులు అమృత రాజేందర్, జిల్లా సంయోజకులు భూం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి భుంపల్లి భూపాల్, జిల్లా కార్యదర్శి జంగం ప్రశాంత్, నగర సంయోజకులు దత్తు రావు, సంగి రాజేందర్, బాలకృష్ణ, తాటిపాముల రాజేంద్రప్రసాద్, కృష్ణమూర్తి, చౌకి రాజేందర్, ఆస రాజేశ్వర్, పరిమేష్, ఖోల అనుసూజ, కవులు తదితరులు పాల్గొన్నారు.