విద్యార్థులకు స్ఫూర్తి మధు కుమార్: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

IMG 20250509 200933
సంగారెడ్డి ప్రతినిధి, మే 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): కాళ్లు, చేతులు కోల్పోయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పదో తరగతి పరీక్షల్లో 86 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన కంకోల్ గ్రామానికి చెందిన మధుకుమార్ ను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రశంసించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులందరికీ మధు కుమార్ స్ఫూర్తిదాయాకమని అన్నారు. పదవ తరగతిలో ఎంతో కష్టపడి ఉత్తమమైన మార్కులు సాధించావని ఇదే స్ఫూర్తిగా ఉన్నత స్థాయి విద్యలో కూడా కష్టపడాలని అన్నారు. శభాష్ మధు కుమార్ అంటూ కితాబిచ్చారు. మధు కుమార్ ఉన్నత చదువుల కోసం ఎలాంటి సహకారం అయినా అందిస్తామన్నారు. మధు కుమార్ కు, వారి తల్లిదండ్రులకు శాలువా, పూల బొకే తో సత్కారం చేసి మధు కుమార్ కు కంప్యూటర్ అందజేశారు. కంకోల్ గ్రామానికి చెందిన మధుకుమార్. కరెంటు షాక్ బారిన పడి మరణాన్ని జయించాడని, ఈ బాలుడు..ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఏకంగా 86 శాతంతో అంటే 500 మార్కులకు గాను 430 మార్కులు సాధించి వైకల్యం శరీరానికే కానీ లక్ష్యసాధన కాదని నిరూపించాడు అని పేర్కొన్నారు. స్నేహితుడి సాయంతో బడికి వెళుతున్న మధుకుమార్ చాలా దయనీయ పరిస్థితిలో నూ మధుకుమార్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదనీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, గురువుల సహకారంతో చదువు కొనసాగించాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, మధు కుమార్ తల్లితండ్రులు , కంకోల్ పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment