ఆత్మ స్తుతి, మోడీ స్తుతి కోసమేనా మహానాడు?

*ఆత్మ స్తుతి, మోడీ స్తుతి కోసమేనా మహానాడు?*               ఆంధ్రప్రదేలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి మహానాడు సభ ముగిసింది. తిరుపతి మినహా గతంలో రాయలసీమలో మహానాడు జరగలేదు. కడప జిల్లాలో అంటే వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి, జగన్‌ మోహన్‌ రెడ్డి అధికార పీఠంగా పరిగణించబడుతుంది కనుక అక్కడ మహానాడు నిర్వహించడమే ఒక రాజకీయ సంకేతం లాంటిది. అంగరంగ వైభవంగా భారీ ప్రచారంతో సాగిన ఈ మహానాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌ లకు అమితమైన సంతోషాన్ని ఇవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు. 

సభలు మొదలు కాకముందు నుంచే లోకేష్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమిస్తారనే ప్రచారం మార్మోగింది. ఐదేళ్ల విరామంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోవస్తున్నది. కనుక 43 ఏళ్ల తెలుగుదేశం, నాలుగో దఫా పాలన తొలి ఏడాది పూర్తి చేసుకుంటున్న చంద్రబాబు భవిష్యత్‌ రాజకీయ గమనం ఎలా ఉంటుందనేది అందరి దృష్టిలో కీలకంగా ఉండింది.

ఒకవైపు వైసిపి, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అనుచరులపై వరుస కేసులు, అరెస్టులు సాగుతుండగా మరోవైపు కూటమిలో సర్దుబాట్లు, కేంద్రం సహాయం తీరుతెన్నులు, తెలుగుదేశంలో సీనియర్‌ జూనియర్ల మధ్య గడబిడలూ, ఆశావహుల అసంతృప్తులు ఇవన్నీ రంగం మీదకు వచ్చాయి. జగన్‌ ప్రభుత్వ తప్పిదాలపై తీవ్ర అసంతృప్తితో తమను గెలిపించిన ప్రజలకు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల అమలుపై మహానాడులో ఏం చెప్తారోనని సామాన్య జనం కూడా ఎదురుచూశారు.

అతిశయాలతో ఆత్మ స్తుతి

అట్టహాసాలు, ఆర్భాటాలు చాలా ఉన్నా ఈ అన్ని విషయాల్లోనూ అస్పష్టతనే మిగిలిస్తూ మహానాడు ముగిసింది. రాష్ట్రానికి సంబంధించి గాని, తెలుగుదేశం అంతర్గత వ్యవహారాలకు సంబంధించి గాని నిర్మాణాత్మకంగా నిర్దిష్టంగా చెప్పింది దాదాపు లేదు. పైగా ఇది వ్యూహాత్మకంగా జరిగిందే తప్ప యాదృచ్ఛికం కాదు. అయినా మహానాడు మరునాడే చంద్రబాబు నాయుడు జాతీయ మీడియా లోనూ, సిఐఐ వంటి వేదికలపైనా చేసిన ప్రసంగాలలో ఏపీ బ్రాండ్‌ ఏదో మారిపోయి పెట్టుబడుల వరద ప్రవహిస్తున్నట్టు తాను అద్భుతమైన పథకాలను రూపకల్పన చేసినట్టు మాట్లాడటం దీనికి కొసమెరపు.

ఎందుకంటే ఆయన చెబుతున్న వాటి నికర ఫలితాలు ఏవీ వచ్చింది లేదు. అసలు ఆ విధానాల పూర్తి స్వరూపం, కాల వ్యవధి నిర్దిష్ట రూపంలో అందుబాటులో లేవు. లోకేష్‌కు ప్రమోషన్‌ ఎప్పుడు ఎలా ఇస్తారన్నది పూర్తిగా తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయమే. కావలసినంత ఎలివేషన్‌ అయిపోయిందని, డిక్లరేషన్‌ మాత్రమే మిగిలిందని టిడిపి ముఖ్యులే అంటున్నారు. చంద్రబాబు నాయుడుని మరోసారి రెండేళ్ల కాలానికి అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో ఒక ఘట్టం పూర్తయింది. మిగిలిన నియామకాలకు ఆయనే ముహూర్తం నిర్ణయించుకుంటారు. పదవులకు సంబంధించిన అంశాలు అలా ఉంచితే తెలుగుదేశం పార్టీ రాజకీయ విధానాలు, కూటమి ప్రభుత్వ పాలన విధానాలు మాత్రం ప్రజలందరికీ సంబంధించినవి.

దేశాన్ని పాలించే ఎన్డీఏ కూటమికి ప్రధాన మద్దతుదారుగా ఉన్నందువల్ల జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ పరిణామాల మీద కూడా ఒక వైఖరి ప్రకటించాల్సిన బాధ్యత మహానాడుపై ఉండింది. కానీ ఆత్మ స్తుతి, మోడీ స్తుతి, ఆర్భాటపు ప్రకటనలు మినహాయిస్తే ఆ విధమైన రాజకీయ, పరిపాలనా నిర్దేశం ఏదీ కనిపించకపోవడం అతి పెద్ద లోపం. ఆర్థికంగా తీవ్ర లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన భారీ హామీలు అమలు చేయగలిగిన స్థితిలో లేదు.

అందుకోసం టిడిపి మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం అటు నుంచి కనీసం గట్టిగా అడిగే పరిస్థితిలో కూడా లేదు. ఇప్పటికే ఏడాదిలో లక్ష కోట్ల పైన అప్పులు చేశారన్న విమర్శలు మోగుతున్నాయి. తొలి ఏడాదిపై కాగ్‌ ఇచ్చిన నివేదిక చూస్తే 95 వేల కోట్లు ప్రభుత్వ వ్యయం లోటు కనిపిస్తుంది. వీటికి తోడు ఇంటి పన్ను, కరెంటు చార్జీలు మోత మోగిపోతున్నాయి. ఏపీ అంటే అమరావతి-పోలవరం అనే చంద్రబాబు ఇచ్చిన నిర్వచనంతో తేడాలు చాలా ఉన్నాయి కానీ వాటికి కూడా నిధుల కేటాయింపులు, పునరావాస ప్రణాళికలు ఏమాత్రం జరిగింది లేదు. పోలవరం 2027కు పూర్తి చేస్తామని మహానాడులో చంద్రబాబు హామీ ఇస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు రాకుండా ఉండవు. అమరావతికి కేంద్రం సహకరించాలని విభజన చట్టంలో ఉన్నది. కానీ మోడీ సర్కారు ప్రపంచ బ్యాంకు అప్పు ఇప్పించటమే ఘనతగా చెప్పడం తప్ప ఆ హామీ అమలు చేయమని అడిగే ఆలోచన కూడా లేకపోయింది. కేంద్రం బాధ్యతగా ఉన్న రెండు కీలక అంశాల్లోనే ఇంత తడబాటు ఉంటే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏదో సాధించి పెట్టడం ఊహకందని విషయం. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం పేర మరో 45 వేల ఎకరాలు కావాలని ప్రకటించడం, అసలు రాజధానికే మరో పది వేల ఎకరాలు అవసరమవుతాయని చెప్పడం చూసి జనం నిర్ఘాంతపోతున్నారు. భోగాపురం ఎయిర్‌ పోర్టుకు కూడా మరింత భూమిని కేటాయించారు. ఉర్సా భూముల వ్యవహారాన్ని సమర్థించుకున్నారు.

కేంద్రాన్ని అడగరా?

గత ఐదేళ్లు పాలించిన వైసిపి ఈ విషయంలో చూపిన నిర్లక్ష్యం అస్తవ్యస్త నిర్ణయాలు ఎంతైనా ఖండించవచ్చు. కానీ ఆ పేరుతో ప్రస్తుత కర్తవ్యాలను దాటవేయడం, కేంద్రం సహాయంపై ఒత్తిడి పెట్టకపోవడం ఎలా సమర్ధనీయం? తమ సొంత కారణాల వల్ల మోడీతో తెలుగుదేశం పోట్లాడటం కష్టం అనుకుంటే అప్పుడు అఖిలపక్ష వేదికల నుంచి రాష్ట్రం తరఫున ఒత్తిడి తేవడం సరైన మార్గం. అది విభజిత రాష్ట్రం హక్కు కూడా. కానీ మూడు రోజుల మహానాడులో అంతా మేము చూసుకుంటామనే ఊకదంపుడుతోనే సరిపోయింది.

తమను తాము పొగుడుకున్నది చాలక ఎన్టీఆర్‌ ఏఐ ఇమేజ్‌ తోనూ పొగిడించుకున్నారు. ఆయన వారసత్వం చూస్తే అయోధ్యకు అద్వానీ రథయాత్ర, బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం ఎన్టీఆర్‌ బిజెపిని పూర్తిగా దూరంపెట్టారు. కింగ్‌ మేకర్‌గా అభివర్ణించబడే చంద్రబాబు నాయుడు నిజానికి కింగ్‌బ్యాకర్‌గా మారి అప్పుడు వాజ్‌పేయిని, ఇప్పుడు మోడీని దేశం నెత్తిన రుద్దడానికి ప్రధాన కారకులయ్యారు. హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌, జ్యోతి బసు, వి.పి సింగ్‌ వంటి ఉద్దండుల అండదండతో యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ గా ఉన్నప్పుడు మాత్రమే ఆయన నిజమైన అర్ధంలో కేంద్ర రాజకీయాలలో గౌరవప్రదమైన పాత్ర పోషించ గలిగారు.

బిజెపి-ఎన్‌డిఎల దగ్గర ఆయనది వత్తాసు పలికే పాత్ర మాత్రమే. ఆయన మూడుసార్లు విజయం సాధించినప్పుడు బిజెపితో కలిసి ఉన్న మాట నిజమే కానీ రెండుసార్లు కూడా విడగొట్టుకోక తప్పలేదు. ఇప్పుడైనా పరిస్థితి అంతకంటే భిన్నంగా ఉండదు. పత్యేక హోదా, విశాఖ ఉక్కు పరిరక్షణ, అమరావతికి ఇతోధిక సాయం, పోలవరం సత్వర నిర్మాణం కోసం సహాయ పునరావాస నిధులు లాంటివి గట్టిగా అడిగితే తన అస్తిత్వానికే ముప్పు అని తెలుగుదేశం ఆందోళన పడుతున్నది.

ఆడిస్తున్న బిజెపి

చంద్రబాబు నాయుడును జగన్‌ ప్రభుత్వం అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో నిర్బంధించినప్పుడు పెద్దమ్మ, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మధ్యవర్తిత్వంతో లోకేష్‌ నేరుగా హోం మంత్రి అమిత్‌ షా తో మంతనాలు జరిపారు. మహానాడుకు ముందు, సకుటుంబంగా లోకేష్‌ మోడీని కలుసుకొని రావటం, తర్వాత చంద్రబాబు భేటీ ఇందులో భాగమే. టిడిపిలో సూపర్‌ సీనియర్లకు నమస్కార బాణం వేసి మొత్తం సారథ్యం అంతా లోకేష్‌ బృందానికి అప్పగించటం వెనుక నేపథ్యం ఇది. కార్పొరేట్‌ సంబంధాలు, పి4 వంటివి చంద్రబాబు చూసుకుంటే పార్టీ వ్యవహారాలను, మోడీ-షా లతో రాజకీయ సంబంధాలను లోకేష్‌ నిర్వహిస్తారనేది ఇప్పుడు టిడిపి వర్గాలు చెబుతున్న మాట.

పరిపాలనలో కూడా లోకేశ్‌ నిర్ణాయకంగా పట్టు సాధిస్తున్నారని అధికార వర్గాలు అంటున్నాయి. పెద్ద మెజారిటీతో ఎన్నికైన తెలుగుదేశం తరఫున ఆయన బండి నడిపించడంలో అభ్యంతరం ఉండదు. కానీ బిజెపి రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సనాతన జపం చేస్తుంటే లోకేష్‌ కూడా టిడిపిని అదే బాటలో వేగంగా నడిపించడం కొత్త పరిణామం. అందుకే మొత్తం మహానాడులో ఎక్కడా లౌకికతత్వం, మత సామరస్యం కాపాడుకోవడం వంటి మాటలే వినిపించలేదు.

ఆ పార్టీ రాజకీయ తీర్మానంలో కూడా ఆ పదాలు లేవు. నిజానికి ఈ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ తన హరిహర వీరమల్లు పేరిట తీస్తున్న సినిమా కూడా సనాతన ఫార్ములాలో ఔరంగజేబ్‌పై పోరాటం వంటి కథ కావడం యాదృచ్ఛికం కాదు. దానికోసం సినిమా థియేటర్లపై విరుచుకుపడటం మరో దారుణం. ఇటీవలి కాలంలో దళితులు, మహిళలపై దాడులు అనేకం చూశాం. తిరుపతి, ఉండి వంటి చోట్ల గుడిసెల కూల్చవేతలు, తెనాలిలో పోలీసుల థర్డ్‌ డిగ్రీ తీవ్ర నిరసనకు దారితీశాయి. ఇలాంటి అంశాలను చక్కదిద్దే ఆలోచనలేమీ మహానాడులో కనిపించలేదు.

విశాఖలో జూన్‌ 21న మోడీ సమక్షంలో తలపెట్టిన యోగా దినోత్సవ ప్రహసనం దీనికి పరాకాష్ట. ఉద్యోగాంధ్ర బదులు యోగాంధ్ర హడావుడి చూస్తే మోడీ మెప్పు కోసం కూటమి తాపత్రయం తెలుస్తుంది. విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టి ఉద్యోగులకు ఉద్వాసన చెప్పి అనకాపల్లిలో స్టీల్‌ హబ్‌తో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామనడం హాస్యాస్పదం. మహానాడు తర్వాత వారం రోజుల్లో కడప ఫ్యాక్టరీ వచ్చేస్తుందనడం కూడా అలాంటి ప్రచారమే. రాయలసీమ ప్రాజెక్టులు విస్మరించినా ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో ప్రైవేటు రంగంలో 80 వేల కోట్లు ఖర్చయ్యే బనకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ గురించి చంద్రబాబు గొప్పగా చెప్పడమూ అలాంటిదే.

ఈ సమయంలో జగన్‌ కూడా సంక్షేమ పథకాలు తాము అమలు చేస్తే టిడిపి వాగ్దాన భంగం చేసిందని విమర్శించడం తప్ప కేంద్రాన్ని స్పృశించడం లేదు. ఏపీలో వైసిపి టిడిపి, జనసేన, తెలంగాణలో బిఆర్‌ఎస్‌ నాలుగు ప్రాంతీయ పార్టీలు బిజెపి ముందు గప్‌ చిప్‌ కావడమే ఇక్కడ ఉమ్మడి అంశం. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ కుమార్తె కవిత తమ పార్టీని బిజెపిలో విలీనం చేయడానికి కుట్ర జరిగిందని సంచలన ఆరోపణ చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఈ విధంగా రెండు రాష్ట్రాలలోనూ తెర వెనక నుంచి బిజెపి నడిపిస్తున్న మాయ నాటకాల పూర్తి స్వరూపం ముందు ముందు మరింత స్పష్టంగా బోధపడకపోదు. బహుశా అలాంటి భయంతోనే చంద్రబాబు చివరలో వైకుంఠపాళీ వద్దని వేడుకున్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ టిడిపి నేరుగా రెండవ పర్యాయం గెలిచింది లేదన్న వాస్తవమే ఆయనతో అలా మాట్లాడించిందా?

Join WhatsApp

Join Now

Leave a Comment